Viveka Murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఓ కీలక అడుగు వేసింది. గత 60 రోజులుగా కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ కేంద్రంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సారి విచారణ తుది దశకు చేరినట్లు సమాచారం. ఆ సారి విచారణలో అరెస్టులు ఉంటాయని ముందు నుండి ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో అనుమానితుడై వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
సీబీఐ పై ఇటీవలే సునీల్ కుమార్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు మార్లు సునీల్ కుమార్ ను సీబీఐ అధికారులు విచారించారు. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సునీల్ కుమార్ పులివెందులలోని నివసానికి తాళం వేసి కుటుంబంతో సహా పరారయ్యారు. దీంతో అతని ఆచూకి కోసం సీబీఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. సునీల్ కుమార్ గోవాలో ఉన్నట్లు తెలుసుకున్న సీబీఐ అధికారులు అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
సునీల్ కుమార్ యాదవ్ని నేడు రేపో కోర్టుకు హజరుపరిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వాచ్ మెన్ రంగన్న నుండి మెజిస్ట్రేట్ వద్ద వాగ్మూలం ఇప్పించిన సీబీఐ మరో కీలక అడుగుగా సునీల్ కుమార్ యాదవ్ ను అదుపులోకి తీసుకున్నది. సునీల్ కుమార్ యాదవ్ ను ప్రస్తుత దర్యాప్తు సందర్భంగా 30 రోజులకుపైగా సీబీఐ అదికారులు విచారణ జరిపారు. అంతకు ముందు కూడా సునీల్ కుమార్ ను ఢిల్లీకి తీసుకువెళ్లి లైడిక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారని హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు సునీల్ కుమార్. ప్రస్తుత విచారణ సమయంలో పలు మార్లు సునీల్ కుమార్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అయితే సునీల్ కుమార్ వెనుక పెద్దల హస్తం ఉందని సీబీఐ అధికారులు దృవీకరణకు వచ్చినట్లు తెలుస్తోంది.