YS Sharmila: వైఎస్ షర్మిల నేతృత్వంలో బుధవారం లోటస్ పాండ్ లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్బంగా తొలుత అంబేద్కర్ జీవిత విషయాలు, ఆ నేత గొప్పతనాన్ని వివరించిన షర్మిల.. తరువాత సీఎం కేసిఆర్ తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. దళితులు ఎవరూ సీఎం చేయాలని అడగలేదు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తానంటూ కేసిఆర్ మాట ఇచ్చారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాట తప్పారని అన్నారు. అదే విధంగా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత దళితులకు మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేస్తామని హామీ ఇచ్చి ఆ వాగ్దానాన్ని గాలికి వదిలివేశారన్నారు.
చేవెళ్ల – ప్రాణహిత ప్రాజెక్టుకు నాడు వైఎస్ఆర్ అంబేద్కర్ పేరు పెడితే కేసిఆర్ ఆ ప్రాజెక్టుకు తల తోక తీసేసీ భారీగా అంచనా వ్యయాలను పెంచి అవినీతికి పాల్పడ్డారనీ, కాళేశ్వరం ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టడానికి మనసు రాలేదన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడానికి అడ్డు రాని కోవిడ్ నిబంధనలు అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించడానికి అడ్డువస్తాయని తెలంగాణ ప్రభుత్వం జయంతి వేడుకలను నిర్వహించలేదని విమర్శించారు. దళితులు అంటే కేసిఆర్ కు ఎంత ప్రేమో అంటూ షర్మిల సెటైర్ వేశారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్యపై ఒక్క ఆరోపణ వస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా పదవి నుండి తొలగించిన కేసిఆర్..మంత్రి మల్లారెడ్డిపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ఆయన చెవికి వినిపించడం లేదని, చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. వీటిని బట్టి చూస్తేనే కేసిఆర్ కు దళితులు అంటే ఎంత ప్రేమో అర్థం అవుతుందని షర్మిల అన్నారు.
త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని అనౌన్స్ చేయనున్న షర్మిల ప్రతి సందర్భంలోనూ, సభలోనూ టీఆర్ఎస్ సర్కార్ ను, సీఎం కేసిఆర్ ను విమర్శిస్తూనే ఉన్నారు. షర్మిల రాజకీయ అరంగ్రేటం చేస్తున్నారని ప్రకటన వచ్చినప్పటి నుండి షర్మిల వెనుక కేసిఆర్ ఉన్నారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షర్మిల ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో తన రాజకీయ ప్రవేశం గురించి స్పష్టం చేశారు. కేసిఆర్ రమ్మంటేనో, బీజేపీ పిలిస్తేనో, కాంగ్రెస్ అడిగితేనో పార్టీ పెట్టడానికి రాలేదని తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలన్న లక్ష్యంతోనే రాజకీయ పార్టీ స్థాపిస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.