వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిల లోటస్ పాండ్ లోని తన నివాసంలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర కు అనుమతి ఇచ్చే వరకూ పచ్చి మంచినీళ్లు కూడా తీసుకోనంటూ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. షర్మిలకు మద్దతు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా దీక్షా శిబిరంలోనే కూర్చున్నారు. షర్మిల దీక్షా వేదికపైనే రాత్రి నిద్రించారు. నిన్న సాయంత్రం నుండి మంచినీళ్లు కూడా తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు.
అపోలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ సునీతారెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం దీక్షా శిబిరానికి వచ్చి షర్మిల ఆరోగ్య పరిస్థితిపై వైద్య పరీక్షలు నిర్వహించారు. గంట గంటకు డిహైడ్రేషన్ పెరుగుతోందనీ, దీని ప్రభావం కిడ్నీలపై పడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరో పక్క షర్మిల ఆమరణ దీక్ష నేపథ్యంలో లోటస్ పాండ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసుల బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. తన ప్రాపర్టీలోకి పోలీసులు రావద్దు అంటూ షర్మిల హెచ్చరించిన నేపథ్యంలో పోలీసులు లోటస్ పాండ్ బయట బందోబస్తు కొనసాగిస్తున్నారు. కార్యకర్తలను పార్టీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు.