YSRTP: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కార్యాలయ భూమి పూజ శుక్రవారం జరిగింది. పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాలేరు నుండి పోటీ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు పాలేరు కరుణగిరి చర్చి సమీపంలో వైఎస్ఆర్ టీపీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు, చర్చి ఫాదర్ లు, ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో పూజలు, ప్రార్ధనలు చేశారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆమె తల్లి., ఇంతకు ముందు ఏపిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ విజయమ్మ గౌరవ అతిదిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంలో వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ పాలేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ ద్వారా మరో ముందడుగు పడిందని అన్నారు. అదే విధంగా మరో సారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని విజయమ్మ అనడంతో ఓ మహిళా నాయకురాలు తెలంగాణ పార్టీ అని సరి చేయడంతో విజయమ్మ సారీ చెబుతూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా సరి చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది ఒక నాందిగా భావిస్తున్నానని విజయమ్మ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలు, వెనుకబడిన వర్గాలు, నిరాదరణకు గురైన వారి జీవితాలు బాగు చేయడం కోసం మహాసంకల్పంతో ఇది ఒక తొలిమెట్టుగా భావిస్తున్నానన్నారు. రాజశేఖరరెడ్డి జీవితంలో ప్రతి మలుపులోనూ జనంతో ముడిపడి ఉందని, వైఎస్ ప్రతి సారి తనతో ఆ మాట అనే వారని అన్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబం ప్రజల కుటుంబం, జగదేశ కుటుంబం అనేది మీకందరికీ తెలిసిందేన్నారు. అదే విధంగా ప్రజల మంచి కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, నష్టాలు వచ్చినా చిరునవ్వుతో స్వీకరించి వెనుకడుగు వేయకుండా ముందుకు వెళ్లే కుటుంబం రాజశేఖరరెడ్డి కుటుంబం అని చెప్పారు. మాట తప్పని, మడమ తిప్పని కుటుంబం రాజశేఖరరెడ్డి కుటుంబం అని అన్నారు. ఏదైనా మాట ఇస్తే అది జరిగి తీరాల్సిందేనని, ఆ మాట కోసం ఎందాకైనా పోతారు అనేది అందరికీ తెలిసిందేన్నారు. అటువంటి రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిలమ్మ ఈ ప్రజల కోసం, మీఅందరి కోసం చిత్తశుద్ధితో సేవలు అందించానికి మీ ముందుకు వచ్చిందని తెలిపారు.
పార్టీ పెట్టిన 16 నెలల కాలంలో ఆమె ఏయే అడుగులు వేసిందో అందరికీ తెలుసునన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎండైనా వానైనా ముందుకే అడుగులు వేసిందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభో అంటే లాఠీ చార్జీ చేశారనీ, రైతులను కాపాడండి దొరలారా అని అరెస్టు చేశారు. ప్రజల బాధలు తీర్చండి అంటే వారిని కొట్టి, తిట్టి, రక్కి, గిచ్చి ఇలా ఏనో రకాలుగా అవమానాలకు గురి చేశారని ఆరోపించారు. ఇవేళ తెలంగాణ ప్రభుత్వంలో షర్మిలమ్మకే భద్రత లేకపోతే సాధారణ ప్రజలకు యువకులు ఏ విధంగా రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. షర్మిలమ్మను పోలీసులు నిర్బంధించారు. బంధించారు. తల్లిగా తనను కూాడా ఆమె వద్దకు పోనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిలమ్మ అంటే ఎందుకు అంత కక్ష, ధ్వేషమని కేసిఆర్ సర్కార్ ను విజయమ్మ ప్రశ్నించారు. మహిళ అని చూడకుండా అవమానాలకు గురి చేశారని అన్నారు.
ఈ ప్రభుత్వం ఏమి చేసినా షర్మిలమ్మను ప్రజల నుండి వేరు చేయలేరని విజయమ్మ అన్నారు. ఉదయించే సూర్యుడుని ఎవరూ ఆపలేరని అన్నారు. ప్రజలకు మంచి చేయాలని, వారి జీవితాలు బాగు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మొక్కవోలిన విశ్వాసంతో తన ప్రయత్నాన్ని షర్మిలమ్మ కొనసాగిస్తొందని అన్నారు. షర్మిలమ్మ ప్రస్థానంలో ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనదని అన్నారు. పార్టీ భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తుకు ఈ రోజు పునాది రాయి పడిందన్నారు. ఇక నుండి షర్మిల ఇల్లు ఎక్కడ అంటే పాలేరు అని, తెలంగాణను పాలించే ఊరు పాలేరు అని, ఖమ్మం జిల్లా కొత్త ప్రభుత్వానికి గుమ్మంగా పేర్కొన్నారు విజయమ్మ, షర్మిలమ్మ తెలంగాణ బిడ్డ కాదని విమర్శించే వారందరికీ ఇదే జవాబు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking: మలేషియా రాజధాని శివారులో విరిగిపడిన కొండచరియలు .. ఇద్దరు మృతి, 51 మంది గల్లంతు