YS Sharmila: తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ రాజకీయ అరంగ్రేటం చేసిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ ప్రారంభించిన రెండు నెలల్లోనే పలువురు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో అంతర్గత సమస్యలు, ప్రాధాన్యత లేకపోవడం తదితర కారణాలతో పలువురు ముఖ్యనేతలు పార్టీని వీడారు. ఇటీవల వైఎస్ఆర్ టీపీ మహబూబ్నగర్ పార్లమెంటరీ కన్వీనర్ ఇబ్రహీం, అంతకు ముందు చేవెళ్ల ప్రతాప్ రెడ్డి, ఇందిరా శోభన్ తదితరులు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ ఎదురు దెబ్బలను అధిగమించి పార్టీ బలోపేతం చేసుకునేందుకు షర్మిల కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కారణాలతో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగతో భేటీ అయ్యారు.
హైదరాబాద్ విద్యానగర్ లోని మంద కృష్ణమాదిగ నివాసానికి వెళ్లిన షర్మిల ఆయనను పరామర్శించారు. మంద కృష్ణమాదిగకు ఇటీవల ఢిల్లీలో శస్త్ర చికిత్స జరిగింది. అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షించారు. మందా కృష్ణమాదిగను పరామర్శించిన విషయాన్ని షర్మిల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కృష్ణమాదిగను షర్మిల కలవడంలో మొదటి కారణం పరామర్శించడం కాగా రెండవ విషయం వైఎస్ఆర్ టీపీ నిర్వహిస్తున్న దళిత భేరికి ఆయనను ఆహ్వానించడం.
సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పట్టణంలో వైఎస్ఆర్ టీపీ నిర్వహిస్తున్న దళిత భేరి బహిరంగ సభకు షర్మిల..కృష్ణమాదిగను ఆహ్వానించారు. దళితుల పక్షాన వైఎస్ఆర్ టీపీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కృష్ణమాదిగను షర్మిల కోరారు. కేసిఆర్ సర్కార్ కు మంద కృష్ణమాదిగ వ్యతిరేకంగా ఉన్నందున వైఎస్ఆర్ టీపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉద్యమ నాయకుడుగా పేరున్న మంద కృష్ణమాదిగను పరామర్శ కోసమైనా షర్మిల కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.