YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత వైఎస్ షర్మిలకు టీఆర్ఎస్ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. వైఎస్ షర్మిల బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. షర్మిల పర్యటనలో భాగంగా పలు కుటుంబాలను పరామర్శించడంతో పాటు జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవాలని ప్లాన్ చేశారు.
కార్యక్రమంలో భాగంగా ఉదయం 10.30 గంటలకు మేడారం గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు రాక, ఉపాధి దొరక్క ఇబ్బందులు పడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నీలకంఠ సాయి కుటుంబాన్ని షర్మిల పరామర్శించాల్సి ఉంది. అయితే షర్మిల ఆ గ్రామానికి చేరుకునే సరికి నీలకంఠ సాయి కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిపోయింది. షర్మిల పరామర్శించడానికి వస్తున్నారని తెలిసి కావాలనే నీలకంఠ సాయి కుటుంబాన్ని టీఆర్ఎస్ నేతలు గ్రామం నుండి తరలించారని వైఎస్ఆర్ టీపీ నేత పిట్టా రాంరెడ్డి ఆరోపించారు. అయితే షర్మిల తాళం వేసి ఉన్న నీలకంఠ సాయి ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం షర్మిల హుజూర్ నగర్ సర్కిల్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోదాడ సమీపంలోని దొండపాడు గ్రామానికి బయలుదేరి వెళ్లారు. దొండపాడులో కరోనాతో మృతి చెందిన వైఎస్ఆర్ కుటుంబ సన్నిహితుడు, రిటైర్డ్ ఎక్సైజ్ సూపర్నిటెండెంట్ గున్నం నాగిరెడ్డి కుటుంబాన్ని షర్మిల పరామర్శించనున్నారు.
Read More: Cross Firing: విశాఖ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు..! ఆరుగురు మవోయిస్టులు మృతి..?
తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనే లక్ష్యంగా రాజకీయ అరంగ్రేటం చేసిన వైఎస్ షర్మిల అధికార టీఆర్ఎస్పైనా, సీఎం కేసిఆర్ పైనా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. తొలుత హైదరాబాదులో వివిధ జిల్లాల స్థాయి నాయకులతో సమావేశాలను నిర్వహించిన షర్మిల..ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆ తరువాత నిరుద్యోగ సమస్యపై హైదరాబాద్ లో నిరాహార దీక్ష చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యతో ఆత్మహత్యలు చేసుకున్న బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా నేడు నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చిన షర్మిలకు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది.