YS Sharmila Party: తెలంగాణలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పేరు ఖరారు అయ్యింది. షర్మిల పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ) గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ టీపీకి షర్మిల ప్రధాన అనుచరుడు వాడుక రాజగోపాల్ చైర్మన్ గా వ్యవహరించనున్నారు.
ఈ ఏడాది మార్చి నెలలో షర్మిల రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు షర్మిల పార్టీపై పలు రకాల విమర్శలు చేసినప్పటికీ వాటిని తిప్పి కొడుతున్నారు. తొలుత వివిధ జిల్లాల నాయకులతో సమావేశాలు నిర్వహించి వైఎస్ఆర్ అభిమానుల అభిప్రాయాలను స్వీకరించిన షర్మిల ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ లో తెలంగాణలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు. కేసిఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శలు సందిస్తూ వస్తున్నారు. గతంలో వైఎస్ఆర్ తో సన్నిహితంగా ఉన్న అధికారులు, పలువురు పార్టీ నేతలు షర్మిలను కలిసి సంఘీభావం తెలియజేశారు. కలిసి నడుస్తామని హామీ ఇచ్చారు.
కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో కొద్ది రోజులుగా బయటకు రాని షర్మిల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసిఆర్ సొంత జిల్లా మెదక్ లో పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను షర్మిల పరామర్శించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని షర్మిల చెబుతూ వస్తున్నారు. గత రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు జరగడం లేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.