YS Sharmila: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 72 గంటల నిరాహార దీక్ష చేసిన వైఎస్ షర్మిల నేడు ముఖ్యమంత్రి కేసిఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాలు రావడం లేదని నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసిఆర్ సర్కార్ మానవత్వం అనేది లేకుండా ప్రవర్తిస్తోందని విమర్శించారు. పాలకులకు ఉన్నది గుండేనా, బండరాయా అని నిలదీశారు షర్మిల. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని షర్మిల పేర్కొన్నారు. ఉద్యోగాలు రావడం లేదనీ నిరుద్యోగులు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, ఇవి ప్రభుత్వ హత్యలు కావా, కేసిఆర్ హంతకుడు కాగా అని ప్రశ్నించారు.
గడీల నుండి దొరలు పాలన చేస్తుంటే ప్రతిపక్షాలు గాజులు వేసుకుని వత్తాసుపలుకుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షించేందుకు ఉన్నారా లేక కేసిఆర్ ఆజ్ఞలను అమలు చేసేందుకు జీతాలు తీసుకుంటున్నారా అని షర్మిల ప్రశ్నించారు. తమ ఫిర్యాదును కూడా తీసుకోలేని స్థితిలో పోలీసులు ఉన్నారన్నారు. పోలీసులకు, పాలకులు సిగ్గు అనేది ఉందా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇందిరా పార్క్ నుండి పాదయాత్రగా వస్తుంటే మా చీరలు లాగారు, నా చేయి విరిచారు, ఓ తమ్ముడి కాలు విరగొట్టారు ఆరోపించారు. యూనివర్శిటీల్లో వీసీలు లేరని అన్నారు. విద్యార్థులకు, ప్రొఫెసర్ లకు ప్రభుత్వం గొర్రెలు ఇస్తే అవి కాసుకుంటూ జీవిస్తారని షర్మిల ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటును కేసిఆర్ తన రాజకీయ స్వలాభం కోసమే చేశారని విమర్శించారు.
మూడు లక్షల 85 వేల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని షర్మిల ప్రశ్నించారు. ఉద్యోగాలను భర్తీ చేసే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోనే ఖాళీలు ఉన్నాయనీ, ఇక వాళ్లు ఉద్యోగ ఖాళీలను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వచ్చే వరకూ తాను పోరాడుతాననీ, ప్రతి జిల్లాలోనూ రిలే దీక్షలు కొనసాగుతాయని షర్మిల పేర్కొన్నారు. నిరుద్యోగుల వయోపరిమితిని ఏడేళ్లు పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు. నిరుద్యోగులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దనీ రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని షర్మిల భరోసా ఇచ్చారు.