YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో సారి సీఎం కేసిఆర్, తెలంగాణ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి నిరసన తెలియజేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, వందలాది మంది నిరుద్యోగులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించిన వార్త ను తన ట్విట్టర్ ఖాతాలో షర్మిల పోస్టు చేస్తూ తెలంగాణ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు.
YS Sharmila: కేసిఆర్ సారూ ఎందుకు భయపడుతున్నారు?
“మేము ఇచ్చిన పిలుపు మేరకు హూజారాబాద్ లో వందలాది మంది నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్ లు నామినేషన్లు వేయడానికి వస్తే అడ్డుకుంటున్నారు. అయ్యా కేసిఆర్ గారూ మీకు ఎందుకు అంత భయమైతోంది ?. ఇక్కడ మీ పరువు పోతుందని భయపడుతున్నారా? లేక ఓడిపోతారని భయపడుతున్నారా ? అందుకే అడ్డుకుంటున్నారా ?” అని షర్మిల ప్రశ్నించారు. “ ప్రజల కోసం పని చేయాల్సిన పోలీసులు కేసిఆర్ గారికి తొత్తులుగా మారారు. రాజ్యాంగ బద్దంగా పని చేయాల్సిన రిటర్నింగ్ ఆఫీసర్..కేసిఆర్ గారికి అమ్ముడు పోయారు. కేసిఆర్ ..మీరు ఎన్ని అవాంతరాలు సృష్టించినా మిమ్మల్ని నిరుద్యోగిని చేసే వరకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే వరకూ మా ఈ పోరాటం ఆగదు” అని షర్మిల హెచ్చరించారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల నిరసన
హూజారాబాద్ బై ఎలక్షన్ లో నామినేషన్లు దాఖలు చేసేందుకు నిన్న ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద సంఖ్యలో రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు బస్టాండ్ వద్ద అఫిడవిట్ లతో నిరసన తెలియజేశారు. పోలీసులు, ఎన్నికల అధికారులు అడ్డంకులు సృష్టించడం వల్ల నామినేషన్లు వేయలేకపోయామని ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం నేతలు పేర్కొన్నారు. అయితే ఎట్టకేలకు గురువారం జగిత్యాల జిల్లాకు మల్యాల మండలానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ గడ్డం రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. తనను బలపరిచే పది మంది స్థానిక ఓటర్లను వెంట బెట్టుకుని వెళ్లి నామినేషన్ సమర్పించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉన్న ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 30వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. నామినేషన్ల దాఖలునకు నేడు తుది గడువు కాగా పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్ లు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చి భంగపడ్డారు. కాగా ప్రధానమైన పోటీ బీజేపీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నెలకొందని పరిశీలకులు పేర్కొంటున్నారు. టీఆర్ఎస్ తనకు చేసిన అన్యాయాన్ని వివరిస్తూ ఈటల సానుభూతితో విజయం సాధించాలని ప్రయత్నిస్తుండగా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ టిఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రులు హరీష్ రావుతో సహా పలువురు నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈటలను ఏలాగైనా ఓడించాలని అధికార టీఅర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది.