YS Sharmila : తెలంగాణ Telangana లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి YS Rajashekara reddy తనయ వైఎస్ షర్మిల నేడు విద్యార్థులతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల.. కొద్ది రోజులుగా వైఎస్ఆర్ అభిమానులతో లోటస్ పాండ్ వేదికగా సమావేశాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఓ పక్క షర్మిల రాజకీయ పార్టీపై వివిధ రాజకీయ పక్షాలు విమర్శలు చేస్తున్నా ఆమె మాత్రం వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తున్నారు. గతంలో రాజశేఖరరెడ్డితో సన్నిహితంగా పని చేసిన పలువురు అధికారులు, నేతలు షర్మిలను కలిసి తమ మద్దతు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో షర్మిల విద్యార్థులతో సమావేశం నిర్వహించి విద్యాలోకాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ హయాంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థినీ విద్యార్థులకు ఉన్నత చదువులు సాకారం అయ్యాయి. విద్యార్థుల భేటీలో షర్మిల ఫీజు రీయింబర్స్మెంట్ పథకం గురించి వివరిస్తూ డబ్బులేని కారణంగా ఏ పేద విద్యార్థి చదువు ఆగిపోవద్దని రాజశేఖరరెడ్డి భావించారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకున్న ఎంతో మంది నేడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. వాళ్లంతా ఎప్పటికీ రాజశేఖరరెడ్డిని గుర్తు పెట్టుకుంటారని అన్నారు.
ప్రతి జిల్లాకు యూనివర్శిటీ తెచ్చిన ఘనత వైఎస్ఆర్ కు దక్కుతుందన్నారు. తెలుగు ప్రజలను రాజశేఖరరెడ్డి గుండెలో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. నేడు అందరికీ ఒక మంచి సమాజం కావాలన్నారు. తెలంగాణలో ఎంతో మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. అందరి నిరీక్షణ ఫలిచాలంటే ఓ మంచి సమాజం రావాలని ఆభిలషించారు. మీ అక్కగా సమాజాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 350 మంది విద్యార్థులు పాల్గొన్నారు.