YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైెఎస్ రాజశేఖరరెడ్డి 12వ వర్థంతి సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ తొలి సారిగా హైదరాబాద్ నోవా టెల్ హోటల్ నందు సంస్మరణ సభ (ఆత్మీయ సమ్మేళనం) ఏర్పాటు చేయడంతో ఇందులో రాజకీయ కోణం దాగి ఉందని చాలా మంది ముందే ఊహించారు. వైెఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఉన్నందున ఈ పార్టీ బలోపేతం చేసేందుకే ఈ సమావేశాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు స్పష్టం అయ్యింది. రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు వివిధ రాజకీయ పార్టీల్లోని వైఎస్ఆర్ సహచరులను,
ఆయన మంత్రివర్గంలో పని చేసిన వారిని విజయమ్మ ఆహ్వానించినప్పటికీ ఈ సమావేశ ఏజండాను అత్యధికులు గ్రహించారు. అందుకే వారు వైఎస్ఆర్ పై అభిమానం ఉన్నప్పటికీ ఆత్మీయ సమ్మేళనం (సంస్మరణ సభ)కు డుమ్మా కొట్టారు. ఈ నాయకులు ఊహించినట్లే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రసంగాలు జరిగాయి. వైఎస్ఆర్ అభిమానులు ఏపిలో జగన్మోహనరెడ్డి సీఎం అయ్యేందుకు తోడ్పాటు అందించారనీ, అదే విధంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకువచ్చేందుకు కంకణం కట్టుకున్న రాజన్న బిడ్డ షర్మిలకు అండగా వైెఎస్ అభిమానులు, సహచరులు నిలవాలని విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
వైఎస్ షర్మిల కూడా తను పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తూ తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానంటూ సంస్మరణ సభలో రాజకీయ ప్రసంగం చేశారు. అటు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఇద్దరూ వైెఎస్ గురించి మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగానికి గురైయారు. ఈ సంస్మరణ సభ ఉద్దేశాన్ని ముందే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ.. పార్టీకి చెందిన వారు ఎవరూ హజరు కావద్దంటూ ఆదేశాలను జారీ చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరై వైఎస్ఆర్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. తాను ముందే వదిన విజయమ్మకు హజరు అవుతానని మాట ఇచ్చాననీ ఆమెకు ఇచ్చిన మాట కోసం వైఎస్ఆర్ సంస్మరణ సభకు హజరైనట్లు చెప్పుకొచ్చారు కోమటిరెడ్డి. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇచ్చినప్పటి నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి కోమటిరెడ్డి హజరు అవుతారని ఆ పార్టీ నేతలు ముందుగానే ఊహించారు.
ఇక పోతే వైెఎస్ మంత్రివర్గంలో పని చేసిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎక్కువ మంది తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీలలో, ఏపిలో వైఎస్ఆర్ సీపీలో కన్ఫర్ట్ గా ఉన్నారు. విజయమ్మ ఆహ్వానాన్ని మన్నించి గానీ, వైెఎస్ పై ఉన్న అభిమానంతో గానీ ఈ సమావేశానికి హజరై ఉంటే షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీలో చేరే అవకాశం ఉందటూ మీడియాలో వార్తలు వస్తాయి. దీంతో ఆయా పార్టీలో వారికి ప్రాధాన్యత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. దాదాపుగా అందరూ సీనియర్ నాయకులే కదా అందుకే ఈ పరిణామాలు ఊహించే వైఎస్ఆర్ పై ఉన్న అభిమానాన్ని మనసులోనే ఉంచుకుని మిన్నకుండిపోయారు. కేవిపి రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, రఘువీరారెడ్డి, జితేందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ తదితర నేతలతో పాటు వైఎస్ హయాంలో పని చేసిన పలువురు అధికారులు మాత్రం ఆత్మీయ సమ్మేళనంకు హజరైయ్యారు.
1.Toll Issue: టోల్ ఫీజు విషయంలో మాజీ కలెక్టర్ గొడవ..!
3.friendship: దొంగలతో స్నేహం వారిని ఆలా మార్చేస్తుందేమో..!!