YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్థంతిని పురస్కరించుకుని వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి గతంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో పని చేసిన వారిని, వైఎస్ఆర్ కుటుంబ శ్రేయోభిలాషులు, సన్నిహితులను ఆహ్వానిస్తున్నారుట. ఆ మేరకు ఇప్పటికే కొందరికి ఆహ్వానాలు అందాయని ప్రచారం జరుగుతోంది. అయితే 2009 సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందగా 2010 నుండి ఇలాంటి కార్యక్రమం నిర్వహించకుండా ఇప్పుడే ప్రత్యేకంగా వైఎస్ విజయమ్మ హైదరాబాద్ లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబంలో రాజకీయ పరమైన విబేధాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అన్న, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభిప్రాయానికి భిన్నంగా సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అనే రాజకీయ పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇటీవల పులివెందులలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లోనూ వైఎస్ జగన్, వైఎస్ షర్మిల వేరువేరుగా పాల్గొనడం, షర్మిల వెంటనే వైఎస్ విజయమ్మ ఉండటం ప్రజలు అందరూ చూశారు. షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించినప్పటి నుండి ఆమె వెన్నంటే వైఎస్ విజయమ్మ ఉన్నారు.
ఏపిలో గతంలో వైఎస్ఆర్కు అనుకూలంగా ఉన్న వారిలో మెజార్టీ నేతలు జగన్ పక్షాన అంటే వైఎస్ఆర్సీపీలో చేరిపోగా తెలంగాణలో మాత్రం కొంత మంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండగా మెజార్టీ నాయకులు అధికార టీఆర్ఎస్, కొందరు బీజేపీలో చేరిపోయారు. అయితే తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన తరువాత తొలి సారిగా వైఎస్ విజయమ్మ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడంలో రాజకీయ వ్యూహం ఉందని అనుకుంటున్నారు. తెలంగాణలో షర్మిల పార్టీ బలోపేతం చేయడంలో భాగంగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారా అన్న చర్చ సాగుతోంది.
మాజీ ఎంపిలు కేవిపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్ కుమార్, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ తో పాటు నాడు వైఎస్ మంత్రివర్గంలో పని చేసిన మంత్రులకు విజయమ్మ స్వయంగా ఫోన్ చేసి కాడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 2009 లో వైఎస్ఆర్ మృతి చెందగా ఇప్పటి వరకూ జరిగిన వర్థంతి, జయంతి కార్యక్రమాలకు గతంలో వైఎస్ఆర్ తో కలిసి పని చేసిన వారికి ప్రత్యేకంగా ఆహ్వానించిన దాఖలాలు లేవు. ఓ పక్క ఏపిలోని వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మ తెలంగాణలో షర్మిల పార్టీకి అండగా నిలుస్తున్నారు. ఈ హోదాలో ఉన్న విజయమ్మ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి తెలంగాణలో వివిధ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పాత సహచరులు హజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ మాత్రం సాగుతోంది.