YS Sharmila: తన పాదయాత్రకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆమరణ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టగా పోలీసులు బలవంతంగా దీక్ష భగ్నం చేసి లోటస్ పాండ్ కు తరలించారు. అరెస్టు చేసిన తమ పార్టీ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండ్ వద్ద రోడ్డుపై భైటాయించి నిరసన వ్యక్తం చేశారు షర్మిల. దాదాపు నాలుగు గంటల పాటు షర్మిల దీక్ష కొనసాగించగా పోలీసులు ఆమెను బలవంతంగా లోటస్ పాండ్ లోని తరలించారు.
.
ఈ క్రమంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగారు షర్మిల. ప్రైవేటు ప్రాపర్టీ అయిన తన నివాసంలోకి ఎలా పోలీసులు వస్తారంటూ మండిపడ్డారు షర్మిల. పోలీసులను తన నివాసం నుండి వెళ్లిపోవాలంటూ తెలిపారు. తన ఇంట్లోలోనే షర్మిల ఆమరణ దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కేసిఆర్ సర్కార్ పై మరో సారి విరుచుకుపడ్డారు షర్మిల. తమ పార్టీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టే వరకూ పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనంటూ భీషణ శపథం చేశారు. షర్మిల దీక్షకు వైఎస్ విజయమ్మ సంఘీభావం తెలిపారు. లోటస్ పాండ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.