ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలకు స్పందన ఎలా ఉంటుందన్నది ముందు ముందు తెలియవచ్చు కానీ…ప్రస్తుతానికి ఆయన కలిసిన బీజేడీ నేత నవీన్ పట్నాయక్ నుంచి కానీ తృణమూల్ అధినేత మమతా బెనర్జీ నుంచీ కానీ స్పష్టమైన సానుకూలత రాలేదనే అనుకోవాలి. అందుకే ఈ భేటీల తరువాత మరోసారి కలిసి మరింత విస్తృతంగా చర్చిస్తామని కేసీఆర్ చెప్పారని భావించాల్సి ఉంటుంది. బీజేడీ వరకూ అయితే అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్ కు సమదూరం పాటించాలన్న విధానాన్ని ముందు కూడా కొనసాగించే ఉద్దేశంతోనే ఉన్నప్పటికీ…ప్రాంతీయ పార్టీల బలోపేతం, జాతీయ స్థాయిలో కీలక పాత్ర కోసం ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఇంకా నిర్ణయించుకోలేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నవీన్ పట్నాయక్ వైఫల్యం వల్లే ఒడిశా వెనుకబడిందంటూ ఇటీవల ఒడిశాలో అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ విమర్శల వెనుక ఆయనను ఏదో ఒక ఫ్రంట్ వైపు మళ్లేలా చేయాలన్న వ్యూహమే కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పూర్తిగా ఒడిశా రాజకీయాలకే పరిమితమై రాష్ట్రంలో పార్టీ పట్టును, పలుకుడిని మరింత బలోపేతం చేసుకునే ఉద్దేశంతోనే ప్రస్తుతానికి పట్నాయక్ ఉన్నారని కూడా ఆ శ్రేణులు చెబుతున్నాయి.
ఇక మమతా బెనర్జీ విషయానికి వస్తే ఆమె జాతీయ రాజకీయాలలో కీలక పాత్రపోషించే ఉద్దేశంతో ఉన్నారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించే విషయంలో మాత్రం ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నట్లే లేరని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ యేతర, కాంగ్రెసేతర ఫెడర్ కూటమి ప్రతిపాదనతో కేసీఆర్ తనతో భేటీ కావడాన్ని ఆమె లైట్ గా తీసుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేతల మాటలను బట్టి తెలుస్తున్నది. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న మమతా బెనర్జీని ఎందరో నాయకులు కలుస్తుంటారనీ, కేసీఆర్ భేటీ కూడా అలాంటిదేననీ వారు చెబుతున్నారు. ఏది ఏమైనా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యత్నాలకు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీల నుంచి ఏమంతా సానుకూలత వ్యక్తమైనట్లుగా కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అఖిలేష్ యాదవ్, మాయావతిలతో భేటీల అనంతరం కేసీఆర్ కూటమి యత్నాలు ఎంత వేగంతో ముందుకు సాగుతాయన్న విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని వారంటున్నారు.