(న్యూస్ అర్బట్ బ్యూరో)
అమరావతి : అనంతపురం జిల్లాలోని కియా ప్లాంట్ను తమిళనాడుకు తరలిస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, అది ఎక్కడికీ వెళ్లడం లేదనీ ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కియా పరిశ్రమ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పట్ల సంతృప్తికరంగా ఉండగా ఇలాంటి దుష్ప్రచారం చేయడం తగదని అన్నారు. తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని అయన ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని బుగ్గన హెచ్చరించారు. తమ ప్లాంట్ ఏపీ నుంచి తరలిపోతోందంటూ వచ్చిన వార్తలపై కియా సంస్థ ప్రతినిధులు కూడా ఖండించినట్లు బుగ్గన గుర్తుచేశారు.
గత ప్రభుత్వం మాదిరిగా తాము అనవసర ప్రచారం చేసుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 1252 కంపెనీలకు ఏపీఐఐసీ భూములు కేటాయించినట్లు మంత్రి బుగ్గన తెలిపారు.