ఐదు రాష్ట్రాల ఎన్నికలూ ప్రశాంతంగా ముగిశాయి. నిన్న తుది విడతగా రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల పోలింగ్ పూర్తి కావడంతో ఇక పార్టీలు సహా అందరి దృష్టీ ఫలితాలపైనే ఉంది. అయితే మధ్య ప్రదేశ్ లో జరిగిన ఒకటి రెండు సంఘటనలు ఈవీఎంల భద్రతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అలాగే తమ ఓటు భద్రమేనా అన్న ఆందోళణను ఓటర్లలో కలుగజేస్తున్నాయి. పోలింగ్ బూత్ నుంచి స్ట్రాంగ్ రూంకు వెళ్లాల్సిన ఈవీఎంలు హోటల్ గదుల్లో చక్కర్లు కొట్టడాన్ని, రోడ్డుపై దొరకడాన్ని ఈ సందర్భంగా జనం ప్రశ్నిస్తున్నారు. పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎంపీలో ఈవీఎంలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయని సెటైర్ వేశారు. హోటల్ లో ఈవీఎంలు టీ తాగుతున్నాయని ఆయన చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. తెలంగాణ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇదే ఆందోళన వ్యక్తం చేశారు. స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఉత్తమ్ కూటమి కార్యకర్తలకు సూచించారు. గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి భారీ చర్చే జరిగింది. పోలింగ్ బూత్ నుంచి నేరుగా స్ట్రాంగ్ రూంకు చేరాల్సిన ఈవీఎంలు దారి మార్చుకుని చక్కర్లు కొట్టి, హోటళ్లలో విశ్రాంతి తీసుకుని ఒక రోజు, రెండు రోజులు ఆలస్యంగా స్ట్రాంగ్ రూంకు చేరిన సందర్భాలు వెలుగులోనికి రావడం మాత్రం ఇదే ప్రథమం.
previous post
next post