రెండో రోజు కొనసాగుతున్న సార్వత్రిక సమ్మె
ఢిల్లీ, జనవరి 9: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా చేపట్టిన 48 గంటల భారత్ బంద్ శాంతియుతంగా కొనసాగుతోంది. బుధవారం పశ్చిమ బెంగాల్లో కార్మికులు రహదారులపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. కేరళలో రైళ్ళు నిలిపివేత, రహదారుల దిగ్భందనం చేపట్టారు. బ్యాకింగ్, తపాలా, టెలికం, ఇన్సూరెన్స్ సేవలపైన బంద్ ప్రభావం కనపడింది.
పశ్చిమ బెంగాల్లో బంద్ తొలి రోజు జరిగిన హింసాకాండను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బందోబస్తు చేయడంతో రెండవ రోజు శాంతియుతంగా జరుగుతోంది. తూర్పు ఢిల్లీలో అఖిల భారత సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ సభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల కనీస వేతనాలు, సామాజిక భద్రత కోసం డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లో ట్రేడ్ యూనియన్ సభ్యులు రహదారులపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఐఎన్టియుసి, ఎఐటియుసి, హెచ్ఎంఎస్, సిఐటియు,ఎఐయుటియుసి వంటి 10 యూనియన్లు సమ్మెలో పాల్గొంటున్నాయి.