ఖాతాల వివరాలు చెబుతామని వెల్లడి
అప్పీలు చేసుకోడానికి చివరి అవకాశం
న్యూఢిల్లీ/బెర్న్: ఇన్నాళ్లూ తమ అక్రమ సంపాదనను స్విస్ బ్యాంకుల్లో ఎంచక్కా దాచుకోవచ్చనుకున్న వారికి చుక్కెదురైంది. దాదాపు 11 మంది భారతీయులకు నోటీసులు వచ్చాయి. అదే మార్చి నుంచి అయితే.. దాదాపు 25 మంది ఇలాంటి నోటీసులు అందుకున్నారు. వారి వివరాలను భారతదేశానికి ఇవ్వాలన్న నిర్ణయంపై అప్పీలు చేసుకోడానికి చిట్టచివరి అవకాశం ఇస్తున్నట్లు ఆ నోటీసులలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్ ప్రభుత్వంలోని ఫెడరల్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ నోటీసులు జారీచేసింది. పలు దేశాలకు ఇప్పటికే స్విస్ ప్రభుత్వం అక్కడి బ్యాంకు ఖాతాదారుల వివరాలను ఇటీవలి కాలంలో ఇచ్చింది. కానీ, భారతదేశం విషయంలో మాత్రం ఇలాంటి కేసులు ఇటీవలి కొన్ని వారాలలో బాగా ఎక్కువయ్యాయి.
మే 21వ తేదీ ఒక్క రోజే 11 నోటీసులను భారతీయులకు పంపారు. అయితే, వాళ్ల పూర్తి పేర్లు బయటకు చెప్పకుండా… కేవలం నాలుగైదు పొడి అక్షరాలు, వాళ్ల జాతీయత, పుట్టినరోజు లాంటి వివరాలు మాత్రమే వెల్లడించారు. ఇద్దరు భారతీయు పేర్లు మాత్రం పూర్తిగా చెప్పారు. వారు.. కృష్ణ భగవాన్ రామ్ చంద్ ( పుట్టిన సంవత్సరం 1949), కల్పేష్ హర్షద్ కినారీవాలా (1972). వీళ్లిద్దరి గురించిన ఇతర వివరాలు మాత్రం ఏమీ చెప్పలేదు. నోటీసులు వచ్చిన మరికొందరి పొడి పేర్లు ఇలా ఉన్నాయి.. శ్రీమతి ఎ.ఎస్.బి.కె. (1944 నవంబరు 24), ఎ.బి.కె.ఐ. (1944 జూలై 9), శ్రీమతి పి.ఎ.ఎస్ (1983 నవంబరు 2), ఆర్.ఎ.ఎస్. (1973 నవంబరు 22), ఎ.పి.ఎస్. (1944 నవంబరు 27), శ్రీమతి ఎ.డి.ఎస్ (1949 ఆగస్టు 14), ఎం.ఎల్.ఎ. (1935 మే 20), ఎన్.ఎం.ఎ. (1968 ఫిబ్రవరి 21), ఎంఎంఏ (1973 జూన్ 27). ఈ నోటీసులలో పేర్లున్నవారు, లేదా వారి ప్రతినిధులు 30 రోజుల్లోగా తనగి ఆధారాలతో అప్పీలు దాఖలు చేయాలన్నారు. మే 7వ తేదీన రతన్ సింగ్ చౌదరి అనే వ్యక్తికి 10 రోజుల్లోగా అప్పీలు చేయాలని నోటీసు వచ్చింది. ఏప్రిల్ లో కూడా జేఎన్వీ, కుల్దీప్ సింగ్ ఢింగ్రా, అనిల్ భరద్వాజ్ .. ఇలా మరికొందరికి నోటీసులు వచ్చాయి.
వీళ్లలో కొందరి పేర్లు ఇంతకుముందు లీకైన పనామా పేపర్లు, హెచ్.ఎస్.బి.సి. జాబితాల్లోనూ ఉన్నాయి. కృష్ణ భగవాన్ రామ్ చంద్, కల్పేష్ హర్షద్ కినారీవాలా ఇద్దరికీ గత ఏప్రిల్ నెలతో పాటు తాజాగా కూడా నోటీసులు అందాయి. మార్చి నెలలో ముంబైకి చెందిన జియోదేసిక్ లిమిటెడ్, దాని ముగ్గురు డైరెక్టర్లు ప్రశాంత్ శరద్ ములేకర్, పంకజ్ కుమార్ ఓంకార్ శ్రీవాస్తవ, కిరణ్ కులకర్ణిలతో పాటు.. చెన్నైకి చెందిన ఆది ఎంటర్ ప్రైజెస్ కు సైతం మార్చి నెలలో నోటీసులు వచ్చాయి. ఈ సంస్థలపై ఇప్పటికే మనీ లాండరింగ్, ఇతర ఆర్థిక అక్రమాల కేసులలో భారతీయ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.