(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ప్రధాని నరేంద్ర మోదీ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటి వంద రోజుల్లో స్టాక్ మార్కెట్లల్లో మదుపరులు కోల్పోయిన డబ్బు ఎంతో తెలుసా. సుమారు 12.5 లక్షల కోట్ల రూపాయలు. మే నెల 30 తేదీన మోదీ అధికారం చేపట్టారు. ఆ ముందు రోజున బిఎస్ఎలో లిస్టయిన కంపెనీల మార్కెట్ విలువ 1,53,62,936.40 కోట్ల రూపాయలు ఉండగా నిన్న మార్కెట్ లావాదేవీలు ముగిసిన తర్వాత ఆ విలువ 1,41,15,316.39 కోట్ల రూపాయలని తేల్చినట్లు ఎన్డిటివి రిపోర్టు చేసింది.
మే నెల 30 వ తేదీ నుంచి ఇప్పటివరకూ సెన్సెక్స్ 2,357 పాయింట్లు (5.96 శాతం) పతనమైంది. ఎన్ఎస్ఇ ఇండెక్స్ 858 పాయింట్లు (7.23 శాతం) పడిపోయింది. ఆర్ధిక వృద్ధి మందగించడం, విదేశీ పెట్టుబడులు తరలిపోవడం, కార్పొరేట్ లాభాలు తగ్గిపోవడం తదితర కారణాల వల్ల స్టాక్ మార్కెట్ల పతనం సంభవించిందని అంటున్నారు.
భారతీయ మార్కెట్లో షేర్లు ఎక్కువగా విక్రయించింది విదేశీ పెట్టుబడిదారులే. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తన మొదటి బడ్జెట్లో విదేశీ పెట్టుబడిదారులపై సూపర్ రిచ్ టాక్స్ విధించడం ఇందుకొక కారణం. మోదీ రెండవ ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ పెట్టుబడిదారులు 28,260.50 కోట్ల రూపాయల విలువైన షేర్లు విక్రయించారు.