(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
వంతెనపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంటే పెద్ద వాళ్లు సైతం వంతెన దాటేందుకు సాహసం చేయలేరు. వాహనచోదకులు వరద ప్రవాహంలో ముందుకు వెళ్లడానికీ భయపడతారు. కానీ 12ఏళ్ల వెంకటేష్ అనే బాలుడు ధైర్యంగా ప్రాణాలకు తెగించి వరద నీటితో నిండి ఉన్న వంతెనపై అంబులెన్స్ వెళ్లేందుకు దారి చూపించి శహాబాష్ అనిపించుకున్నాడు. అంబులెన్స్ ముందు వరద నీటిలో ఆ బాలుడు నడుచుకుంటూ రావడాన్ని సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోను శ్రీకాంత్ ఎస్ హుడ్డార్ అనే న్యాయవాది సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడంతో వందలాది మంది ఆ బాలుడి సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.
ఈ ఘటన కర్నాటర రాష్ట్రం రాయ్చూర్ జిల్లాలోని హిరేరాయనకుంపి గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వరదల కారణంగా మృతి చెందిన ఆరుగురి మృత దేహాలను తరలిస్తున్న అంబులెన్స్ వరద ప్రవాహం కారణంగా ఆ వంతెన వద్ద ఆగిపోయింది. అంబులెన్స్ డ్రైవర్ దారి చూపాలని కోరడంతో వెంకటేష్ ఈ సాహాసం చేశాడు. వెంకటేష్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడు.
కర్నాటక రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా 60వేల ఇళ్లు దెబ్బతినగా సుమారు 60మంది వరకూ మృతి చెందారు. గల్లంతైన 15మంది ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఐదు లక్షల రూపాయల చొప్పన ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
వరద బాధితుల కోసం వెయ్యికి పైగా పునరావాస కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Small in Stature, Big in Heart ❤️
Salute this Boy from #Bagalkot, #Karnataka. He guided ambulance safely to cross the overflowing bridge risking his own life. #KarnatakaRain #KarnatakaFloods #FloodRelief @KiranKS @narendramodi pic.twitter.com/WbEen4Kae2
— Shreekanth S Huddar (@ShreeSHuddar) August 11, 2019