(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అస్సాం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద బీభత్సంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాలలో 21 జిల్లాలు వరదల ప్రభావానికి గురయ్యాయి. వరదలు ముంచెత్తడంతో ఇప్పటి వరకూ ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 15లక్షల మందికిపైగా వరద ప్రభావానికి గురయ్యారు.
బ్రహ్మపుత్రతో పాటు మరో ఐదు నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. 27 వేల హెక్టార్ల మేర పంట చేలు నీట మునిగాయి. వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం 68 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. ఎన్డిఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ 20వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
తేయాకు ఎక్కువగా పండే ధేమాజీ, లఖిమ్పూర్ (అప్పర్ అస్సాం), బొంగైగామ్, బార్పేట (లోవర్ అస్సాం) ప్రాంతాలకు భారీనష్టం జరిగింది. ఎగువ నుండి వరద నీరు లోయల్లోకి రావడంతో లోయర్ అస్సాంలోని ప్రాంతాల పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది. బార్పేట ప్రాంతంలో సుమారు 85వేల మంది తలదాచుకునే చోటు కోసం ఎదురుచూస్తున్నారు. నాగాన్ ఏరియాలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని వరదల పరిస్థితిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి శర్భానంద సోనావాల్ ఫోన్ ద్వారా వివరించారు. అస్సాంతో పాటు ఇతర రాష్ట్రాలలోని పరిస్థితిని సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్షా నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఎఎన్ఐ సౌజన్యంతో….
#WATCH Roads washed away as water from Brahmaputra river enters Nagaon area in Morigaon, in Assam. #AssamFloods pic.twitter.com/Mp26AI7MA6
— ANI (@ANI) July 14, 2019