(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కుంభవృష్టి ముంబై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నది. రెండు రోజులుగా అక్కడ పడిన వాన గత పదేళ్లలో ఎప్పుడూ రాలేదు. వర్షం ఫలితంగా చోటు చేసుకున్న ప్రమాదాలలో ముంబైలో, పొరుగున ఉన్న థానే నగరంలో 12 మంది మరణించారు. మంగళవారం ఫ్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలకు సెలవు ప్రకటించారు.
రైలుమార్గాలు నీట మునిగిన కారణంగా చాలా దూరప్రయాణం రైళ్లనూ, సబర్బన్ రైళ్లనూ రద్దు చేశారు. ముంబై విమనాశ్రయంలో రాత్రి భారీ వర్షంలో ల్యాండ్ అయిన స్పైస్ జెట్ విమానం ప్రదాన రన్వేలో అదుపుతప్పి చివరన చిక్కుకుపోవడంతో 54 విమాన సర్వీసులను రద్దు చేశారు.
వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాలు ఎక్కడివక్కడ నిలచిపోయి ముందుకు కదలడం లేదు. లోతట్టు ప్రాంతాలలో ఇళ్లు నీటమునిగాయి. మంగళవారం కూడా భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పౌరులు అత్యవసరమైతే తప్ప ఇల్లు కదలవద్దని ప్రభుత్వం సూచించింది.