(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిరిండియాకు చెందిన విమానం పిడుగు ప్రభావానికి గురైంది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో విమాన సిబ్బంది కొందరు గాయపడ్డారు. పిడుగు కారణంగా విమానం దెబ్బ తిన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎయిరిండియాకు చెందిన AI-467 నంబర్ విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ అయిన కాసేపటికే ఉరుములు, పిడుగుల వర్షంలో చిక్కుకున్న విమానం.. పిడుగు ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. విమానం ఒక్కసారిగా కుదుపులకు గురి కావడంతో ప్రయాణికులు తినే ఆహార ప్లేట్లు, బాటిళ్లు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిరిండియా విచారణకు ఆదేశించింది. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది.
Air India's AI-467 Delhi to Vijayawada flight suffered damages and crew suffered injuries when the aircraft faced severe thunderstorm. No passengers were reported injured in the incident. Air India has started the investigation in this matter. pic.twitter.com/gCs6NF2XTR
— ANI (@ANI) September 21, 2019
కొద్ది రోజుల క్రితం కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఎయిరిండియాకు చెందిన విమానం 172 ప్రయాణికులతో ఢిల్లీ నుంచి త్రివేండ్రం వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుదుపులకు గురైంది. అయితే, ఈ ఘటనలో ప్రయాణికులకు, విమాన సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.