(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాజధాని అమరావతి ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు జెఏసి నేతలు సన్నద్దం అవుతున్నారు.
ఈ నెల 17న హైపవర్ కమిటీ చివరి సమావేశం, 20వ తేదీ క్యాబినెట్ భేటీ, ఆదే రోజు నుండి మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) తమ ఉద్యమాన్ని ఉదృతం చేయాలని నిర్ణయించుకున్నది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెఏసి నేతలు మాట్లాడుతూ ఈ నెల 20న గుంటూరు జిల్లాలో జైల్ భరో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుండి
ఒకరు ఈ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజధాని ఉద్యమం పట్ల పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
పోలీసుల చర్యలపై హైకోర్టు ఇంటిరియమ్ ఆర్డర్లు ఇవ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. మూడు రాజధానుల రెఫరెండంతో జగన్ ఎన్నికలకు సిద్ధం కావాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు.