(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇరాక్లోని మోసుల్లో పట్టుబడిన ఐసిస్ ప్రముఖ నేత మఫ్తీ అబూ అబ్దుల్ బారిని జైలుకు తరలించేందుకు పోలీసులు ముప్పతిప్పలు పడ్డారు. 250 కిలోలకు పైగా బరువున్న అబూను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు. ఇరాకీ దళాలకు చెందిన ‘స్వాత్ ‘ టీమ్కి ఈ శ్రమ తప్పలేదు.
ఇరాక్లోని మోసుల్ నగరంలో బారిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ, తరలించడానికి పోలీస్ కారు సరిపోలేదంట. చేసేది లేక ఓ ట్రక్ తీసుకొచ్చి అందులో కూర్చొబెట్టి తీసుకువెళ్లారు. సోషల్ మీడియాలో ఆయనను ‘ జబ్బా ది జిహాదీ ‘ అని పిలుస్తారు. భద్రతా దళాలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడన్న ఆరోపణలు బారిపై ఉన్నాయి. ఐసిస్ ముఠాలకు బారి నాయకుడని భద్రతా దళాలు తెలిపాయి. ఐసిస్ ఉగ్రవాద సంస్థకు విధేయులుగా ఉండేందుకు నిరాకరించిన కొందరు ముస్లింలను హతమార్చాలని బారి ‘ఫత్వా’లు కూడా జారీ చేస్తాడని తెలిపారు.
లండన్కు చెందిన ఇస్లామిక్ వ్యతిరేక ఉగ్రవాద కార్యకర్త మాజిద్ నవాజ్ ఫేస్బుక్లో బారిని, ఆయన చేసిన దుశ్చర్యలను ఎగతాళి చేస్తూ సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. పోలీసులు అతణ్ని పట్టుకున్నప్పటికీ భారీకాయంతో ఉండటంతో తరలించలేకపోయారని రాసుకొచ్చాడు. అయితే బారి ఊబకాయాన్ని తాను తప్పు పట్టడంలేదని, ఇస్లామిక్ తీవ్రవాదుల హిపోక్రసీని మాత్రమే తను బయటపెడుతున్నానని పేర్కొన్నాడు.
‘సిరియన్లు, ఇరాకీయులు దీనికి సాక్ష్యంగా నిలిచారు. దేవుడు తమ వైపే ఉన్నాడని మారణకాండ సృష్టించి ఇస్లాం పేరు చెప్పుకుంటున్నారు. అతణ్ని సైకాలజికల్ గా తక్కువ అంచనా వేయొద్దు. అతని శరీరం అంచనాలకు అతీతంగా ఆదేశాలు ఇస్తుంది’ అని పోస్టు చేశాడు.