మధ్యప్రదేశ్ లో పట్టుబడిన భారీ మొత్తం
ఆదాయపన్ను శాఖ వర్గాల వెల్లడి
న్యూఢిల్లీ: లెక్కా పత్రం లేకుండా మహా అయితే రూ. 50 వేలు తీసుకెళ్లచ్చు. సరైన లెక్కలు చూపించి రూ. 4 లక్షలైనా పర్వాలేదు. కానీ అసలు ఏ లెక్కా లేకుండా రూ. 281 కోట్లు ఉంటే? మధ్యప్రదేశ్ లో రెండు రోజులుగా జరిగిన ఆదాయపన్ను శాఖ దాడుల్లో ఇదే బయటపడింది. అక్కడ ఎన్నికలకు ముందు ఐటీ దాడులు జరగడంతో అవన్నీ ప్రతిపక్ష పార్టీల మీద కేంద్రం చేయిస్తోందని ప్రచారం జరిగింది. కానీ, అసలు విషయం ఇదీ అని ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో కొంత మొత్తాన్ని ఢిల్లీలోని ఓ ప్రధాన రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపారని, అందులో రూ. 20 కోట్లను హవాలా మార్గంలో పంపారని చెప్పారు. ఇవన్నీ ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని ఓ పెద్దనాయకుడి ఇల్లు కేంద్రంగా జరిగాయన్నారు.
ఆదాయపన్ను శాఖ అధికారులు పులి చర్మాలు, రూ. 14.6 కోట్ల లెక్కలు లేని సొమ్ముతో పాటు 252 మద్యం సీసాలు, కొన్ని తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. చేత్తో రాసిన డైరీలు, కంప్యూటర్ ఫైళ్లు, ఎక్సెల్ షీట్లు అన్నీ లెక్కలు తేలిస్తే.. నగదు మార్పిడి విషయం తెలిసింది. తర్వాత ఢిల్లీలో జరిగిన దాడుల్లో మరిన్ని వివరాలు తెలిశాయి. అక్కడ ఓ సీనియర్ నాయకుడి సన్నిహిత బంధువు వద్ద నేరపూరిత సాక్ష్యాలు లభించాయి. రూ. 230 కోట్ల లావాదేవీలు, రూ. 242 కోట్ల మొత్తాన్ని బోగస్ బిల్లింగుతో స్వాహా చేయడం, 80 సూట్ కేస్ కంపెనీల వివరాలు అన్నీ లభ్యమయ్యాయి.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ మాజీ వ్యక్తిగత కార్యదర్శి ప్రవీణ్ కక్కర్, మాజీ సలహాదారు రాజేంద్రకుమార్ మిగ్లానీ ఇళ్లలో ఇండోర్, ఢిల్లీ ప్రాంతాలలో సోదాలు జరిగాయి. హవాలా లావాదేవీతో సంబంధం ఉందన్న ఆరోపణలతో ఇవి మొదలుపెట్టారు. కర్ణాటకలో జేడీఎస్ – కాంగ్రెస్ కూటమి నేతలే లక్ష్యంగా ఐటీ సోదాలు జరిగిన వారానికే మధ్యప్రదేశ్ లోనూ జరగడంతో తీవ్ర విమర్శలొచ్చాయి.