(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు ఇప్పుడు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత మొదలైంది. ఈ బిల్లును అంగీకరించబోమని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలకు కారణమైన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేయడంతో చట్టంగా మారింది. అయితే చట్టంగా మారినప్పటికీ పశ్చిమ బెంగాల్ లో దీనిని అనుమతించబోనని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా పంజాబ్, కేరళ రాష్ట్రా ముఖ్యమంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగవిరుద్ధమని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. కేంద్రప్రభుత్వం భారత్ను మతప్రాతిపదికన విడదీయాలని చూస్తోందని ఆరోపించారు. సమానత్వం, లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రం వ్యవహార శైలి ఉందని అన్నారు. బిల్లులో ఎన్నో లోపాలు ఉన్నాయని, దీనిని అమలు చేస్తే అశాంతి పెరుగుతుందని వ్యాఖ్యానించారు.
ఇక కేరళ దారిలోనే పంజాబ్ కూడా బిల్లును అమలు చేయబోమని తేల్చి చెప్పింది. పౌరసత్వ బిల్లును ఆది నుంచి వ్యతిరేకిస్తున్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఇండియాలో దశాబ్దాలుగా ఉన్న లక్షలాది మందికి బిల్లు అనుకూలం కాదని అన్నారు. బిల్లును అమలు చేయబోమని అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ బిల్లును కానీ, జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ)ని కానీ తమ రాష్ట్రంలో అనుమతించబోమని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ గత బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం ఈ బిల్లు చట్టంగా మారడంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ లో హింసకు గురై డిసెంబర్ 31, 2014 కు ముందు భారత్ కు వచ్చిన ముస్లిమేతరులకు నిబంధనల ఆధారంగా భారత పౌరసత్వం కల్పించనున్నారు.
మరోవైపు ఈ చట్టంపై అసోం,, త్రిపుర, మేఘాలయలో తీవ్ర నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఇంటర్ నెట్ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.