న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచారం కేసులో బీజేపీ నుంచి బహిష్కరించబడిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పై సీబీఐ అధికారులు గురువారం ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో 2017లో ఓ మైనర్ యువతిపై స్ధానిక ఎమ్మెల్యేతో సహా ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారానికి పాల్పడినట్టు ఛార్జీషీట్లో పేర్కొన్నారు. 2017 జూన్ 4న ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ తనపై ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు తెలిపింది. అయితే, 2017 జున్ 11న బాధితురాలు అత్యాచారానికి గురయిందని సీబీఐ అధికారులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఢిల్లీలోని తీజ్ హజారీ జిల్లా కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితడు కుల్దీప్ సింగ్ సెంగర్ తో పాటు నరేశ్ తివారీ, బ్రిజేష్ యాదవ్ సింగ్, శుభం సింగ్ అనే ముగ్గురి పేర్లని కూడా చేర్చారు. జూన్ 4న కుల్దీప్ సింగ్ సెంగర్ అత్యాచారానికి పాల్పడగా… వారం రోజుల తర్వాత ఆమెను కిడ్నాప్ చేసి చార్జీషీట్లో పేర్కొన్న ముగ్గురు సామూహిక అత్యాచారం చేసినట్లు సీబీఐ ఛార్జీషీట్లో పేర్కొంది. జూన్ 4న బాధితురాలిని ఎమ్మెల్యే తన నివాసానికి రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ కేసులో అరెస్టయిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ప్రస్తుతం జెల్లో ఉంటూ కోర్టు విచారణ ఎదుర్కొంటున్నారు. ఇటివలే అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తన బంధువులను కోల్పోగా, ఈ కేసును వాదిస్తున్న న్యాయవాదితోపాటు బాధితురాలికి తీవ్ర గాయాలైయ్యాయి. ఆమెకు ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స అందించగా… ప్రస్తుతం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యింది. అయితే తనకు ప్రాణహాని ఉందని ఆమె ఆరోపించింది.
2017 జూన్ 4న శశిసింగ్ అనే మహిళ బాధితురాలిని ఉన్నావో ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ వద్దకు తీసుకెళ్లింది. శశిసింగ్ కుమారుడు శుభం సింగ్ ఈ అత్యాచారం కేసులో ఓ నిందితుడిగా ఉన్నాడు. తనపై ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ అత్యాచారానికి పాల్పడ్డాడని న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలు నేరుగా యూపీ సీఎం యోగీ ఆదిత్యానాధ్ ఇంటిముందు ఆత్మహత్య యత్నం చేయడంతో.. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతరం 2018 ఏప్రిల్ 9న ఆ యువతి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయగా, పోలీస్ కస్టడీలో ఆయన చనిపోవడం యూపీలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నావ్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ను బీజేపీ బహిష్కరణ వేటు వేసిన సంగతి తెలిసిందే.