బెంగళూరు: కర్నాటకలో ఆదాయపన్ను శాఖ అధికారులు 4.5 కోట్లు నగదును సీజ్ చేశారు. కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం జీ పరమేశ్వరతో ఇంటిపై గురువారం ఐటీ దాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే వివిధ ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో సుమారు 4.5 కోట్ల నగదు దొరికినట్లు శుక్రవారం ఐటీ అధికారులు వెల్లడించారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్, కేంద్ర మాజీ మంత్రి ఆర్.ఎల్.జాలప్పల నివాసాలపై ఐటి అధికారులు గురువారం తెల్లవారుజామున దాడులు చేయడంతో కాంగ్రెస్ నేతలు బెంబేలెత్తారు. బెంగళూరు, తుమకూరు సహా మొత్తం 30 చోట్ల సోదాలు చేశారు. పరమేశ్వర కుటుంబం సిద్ధార్థ గ్రూప్ విద్యా సంస్థలను నిర్వహిస్తున్నది. ఈ సంస్థలను పరమేశ్వర తండ్రి హెచ్ఎం గంగాధరయ్య 58 ఏళ్ల క్రితం స్థాపించారు. పరమేశ్వర నివాసం, తుమకూరులోని సిద్ధార్థ మెడికల్ కళాశాలతో పాటు పలు విద్యాసంస్థల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మెడికల్, ఇంజనీరింగ్ సీట్ల విషయంలో కోట్లాది రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిగినట్టు తెలుస్తున్నది. దాదాపు 300 మంది ఐటీ సిబ్బంది ఇద్దరు నేతలకు సంబంధించిన 30 ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. సిద్ధార్థ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని రెండు మెడికల్ కాలేజీల్లో నిర్వహించిన నీట్ పరీక్షల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఐటీ అధికారులు దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది.
మరోవైపు కర్ణాటక శాసనసభ సమావేశాల్లో ప్రారంభమైన తొలి రోజునే కాంగ్రెస్ సీనియర్ నేతలపై ఐటి దాడులు జరగడం సంచలనమైంది. ఇది ఇలా ఉంటే..ఐటి దాడిపై పరమేశ్వర మీడియాతో మాట్లాడుతూ విద్యాసంస్థలు మినహా తమకు ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. ఐటి దాడి జరుపుకోవడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, లోపాలు ఉంటే సరిచేసుకుంటామన్నారు. కాగా, గత కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వ హయంలో పరమేశ్వర కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
మరోవైపు ఐటీ దాడులపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గతంలో ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులు జరిపారని ప్రస్తుతం అదే విధానం కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి డికె శివకుమార్ ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఈడీ విచారణల పేరుతో ఢిల్లీకి రప్పించి డి.కె.శివకుమార్ తీహార్ జైలుకు పంపారని, ఇప్పుడు పరమేశ్వరపైన దాడి చేశారని ఇదంతా కేంద్ర ప్రభుత్వం కుట్ర అని ఆరోపిస్తున్నారు.