(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. శనివారం అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆచూకీ లేకుండాపోయిన నలుగురు ఎమ్మెల్యేలు తిరిగొచ్చినట్లు ఎన్సీపీ వెల్లడించింది. ఎన్సీపీకి చెందిన మొత్తం 54 మంది ఎమ్మెల్యేల్లో ప్రస్తుతం 53 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని తెలిపింది. అనిల్ పాటిల్, దౌలత్ దరోడా, నితిన్ పవార్ లను పార్టీ యూవజన విభాగం రక్షించింది. అనిల్ పాటిల్, దౌలత్ దరోడాను ఢిల్లీ సమీపంలోని గుర్గావ్ నుంచి ముంబైకి తీసుకొచ్చారు. మరో ఎమ్మెల్యే నర్హరి జిర్వాల్ కూడా ఢిల్లీ నుంచి ముంబైకి చెరుకుంటున్నారు. వీరంతా శరద్ పవార్ కే మద్దతిస్తున్నారు. ప్రస్తుతం ఎన్సీపీ చెంత 52 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆపార్టీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు.
ప్రస్తుతం ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ముంబైలోని ఓ హోటల్ లో బస చేస్తున్నారు. ఇప్పటికే శివసేన, కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేల్ని శిబిరాలకు తరలించిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టులో మహారాష్ట్ర అంశంపై విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బలనిరూపణపై కోర్టు ఆదేశాలిచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం కీలకంగా మారింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్ల సంఖ్య 288. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. కానీ, ఫడ్నవీస్ క్యాంప్లో ప్రస్తుతం అంతమంది ఎమ్మెల్యేలు లేనట్లు తెలుస్తోంది. అందుకే.. దీంతో మ్యాజిక్ ఫిగర్ను అందుకునేందుకు అవసరమైన ఎమ్మెల్యేలను శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి నుంచి ఆకర్షించడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్లు సమాచారం.
బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా.. ఎన్సీపీ నుంచి వచ్చిన అజిత్ పవార్, ఆయన వర్గంలోని మరో నలుగురు ఎమ్మెల్యేలు, ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా ఇతర ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నప్పటికీ మొత్తం సంఖ్య 120ని దాటడం లేదని తెలిసింది. ఇక అజిత్ పవార్ వెంట నడిచిన ఎమ్మెల్యేలు తిరిగి వెనక్కి వచ్చేశారు. తాజా పరిణామాల మధ్య ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్నది ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.