క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్లోని క్రైస్ట్చర్చ్ నగరంలో ఒకటి కాదు.. రెండు మసీదుల్లో కాల్పులు జరిగాయి. అలాగే దుండుగులు కూడా ఒకరికంటే ఎక్కువ మందేనని తాజా సమాచారం. ఈ కాల్పులలో దాదాపు 40 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమయం కావడంతో మసీదు వద్ద ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లింలు వస్తారు. ఇదే అదనుగా భావించిన దుండగులు వీరే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఓ వ్యక్తి తొలుత అల్ నూర్ మసీదులోకి చొరబడి ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 27 మంది మరణించారని సమాచారం. ఆ సమయానికి అక్కడి మసీదులో 300 మంది వరకూ ఉన్నారు. మసీదులో చాలా మృతదేహాలు కుప్పలుగా పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సభ్యులు అదృష్టవశాత్తు ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే లిన్వుడ్ మసీదులో మరో దుండగుడు కాల్పులు ప్రారంభించాడు. అతడు ఒంటినిండా ఆయుధాలు ధరించి ఉన్నాడు. విచక్షణా రహితంగా ఎవరు కనపడితే వారిని అతడు కాల్చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ మసీదులోనూ పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు దాడికి పాల్పడిన దుండగుడు ఇంకా ఘటనా స్థలం వద్దే ఉన్నట్లు పోలీసులు చెప్పారు. అతడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఓ నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అల్ నూర్ మసీదు వద్ద కాల్పులు జరిపిన దుండగుడు దీనిని ప్రత్యక్ష ప్రసారం చేసినట్లు న్యూజిలాండ్ మీడియా పేర్కొంది. మొత్తం 17 నిమిషాల పాటు ఈ లైవ్ స్ట్రీమింగ్ జరిగినట్లు వెల్లడించాయి.
ఆ వీడియో ప్రకారం నిందితుడు ఆస్ట్రేలియా దేశానికి చెందిన బ్రెంటన్ టారెంట్ అని సమాచారం. కారులో వచ్చిన దుండగుడు మసీదుకు దగ్గరగా వాహనాన్ని ఆపి ఉంచాడు. ఆ తర్వాత లోపలకు వెళ్లి తన వద్ద ఉన్న తుపాకితో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయద్దని న్యూజిలాండ్ పోలీసులు కోరారు. కాల్పుల నేపథ్యంలో దేశంలోని అన్ని మసీదులను మూసివేయాలని న్యూజిలాండ్ పోలీసులు ఆదేశించారు. స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలనూ మూసేశారు. ఎవరినీ రోడ్డు మీదకు రావద్దని చెప్పారు.