న్యూఢిల్లీ: లోక్ సభకు కొత్తగా ఎంపికైన ఎంపీలలో 43% మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ఈ విషయాన్ని వారే తమ అఫిడవిట్లలో పేర్కొన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్), న్యూ ఎలక్షన్ వాచ్ సంస్థలు తెలిపాయి. 542 మంది ఎంపీలలో 539 మంది అఫిడవిట్లను ఈ సంస్థలు పరిశీలించాయి. మిగిలిన ముగ్గురివి స్పష్టంగా లేకపోవడం వల్ల వాటిని పరిశీలించలేదు. 2014లో అయితే 185 మంది (34%) మంది తమపై కేసులున్నట్లు వెల్లడించారు. 2019లో మాత్రం 162 మంది ఇలా చెప్పారు. 2009 నుంచి నేరచరిత్ర ఉన్న ఎంపీల సంఖ్య 44% పెరిగింది.
ఈసారి కొత్తగా ఎంపికైన 539 మందిలో 159 (29%) మంది తమపై అత్యాచారం, హత్య, హత్యాయత్నం, కిడ్నాప్ లాంటి కేసులున్నాయన్నారు. 2009తో పోలిస్తే ఇలాంటి కేసులున్నవారి సంఖ్య రెట్టింపు అయింది. కేరళలోని ఇడుక్కి నుంచి విజయం సాధించిన డీన్ కురియకోస్ (కాంగ్రెస్)పై మారణహోమం, దోపిడీ, బెదిరింపులు, దురాక్రమణలకు సంబంధించిన 204 కేసులు ఉన్నాయి. తమపై హత్య కేసులున్నట్లు 11 మంది ఎంపీలు చెప్పారు. వాళ్లు.. హోరెన్ సింగ్ బే (బీజేపీ-అసోం), నిషిత్ ప్రమాణిక్ (బీజేపీ, పశ్చిమబెంగాల్), అజయ్ కుమార్ (బీజేపీ-యూపీ), సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకుర్ (బీజేపీ-ఎంపీ), ఛత్తర్ సింగ్ దర్బార్ (బీజేపీ-ఎంపీ), అతుల్ కుమార్ సింగ్ (బీఎస్సీ-యూపీ), అఫ్జల్ అన్సారీ (బీఎస్పీ-యూపీ), అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్ – పశ్చిమబెంగాల్), నబాకుమార్ సరానియా (స్వతంత్ర-అసోం), భోంస్లే శ్రీమంత్ ఛత్రపతి ఉదయన్ రాజె ప్రతాప్ సింగ్ మహరాజ్ (ఎన్సీపీ-మహారాష్ట్ర), కురువ గోరంట్ల మాధవ్ (వైసీపీ – ఏపీ).
బీజేపీ ఎంపీల్లో 116 మందిపై (39%) క్రిమినల్ కేసులు ఉండగా.. కాంగ్రెస్ ఎంపీల్లో 29 మందిపై (57%), జేడీ(యూ) ఎంపీల్లో 13 మందిపై (81%), డీఎంకే ఎంపీల్లో 10 మందిపై (43%), తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల్లో 9 మందిపై (41%) క్రిమినల్ కేసులు ఉన్నట్టు వివరించింది.
దేశంలో ఎక్కువ మంది ఎంపీలున్న (303) బీజేపీలో 116 మంది కోటీశ్వరులున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం వారి వాటా ఎక్కువని ఏడీఆర్ తెలిపింది. ఈ పార్టీ నుంచి ఎన్నికైన 52 మందిలో 41 మంది కోటీశ్వరులే.