ఫిషర్-ప్రైస్ సంస్థ తయారుచేసిన రాక్ ఎన్ ప్లే స్లీపర్లను మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. దాదాపు 50 లక్షల స్లీపర్లలో వేటినీ అమ్మొద్దనిచెప్పారు. 2009లో ఈ మోడళ్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టగా అప్పటినుంచి ఇప్పటివరకు 30 మంది పిల్లలు వీటిలో ఆడుకుంటూ మరణించినట్లు తేలడంతో వెంటనే ఈ చర్య తీసుకున్నారు. పిల్లలు అటూ ఇటూ దొర్లినపుడు కింద పడి మరణిస్తున్నారని వినియోగదారుల ఉత్పత్తుల భద్రతా కమిషన్ పేర్కొంది.
వీటి వల్ల ప్రమాదం ఉందని, అందువల్ల వెంటనే మార్కెట్ల నుంచి తీసేయాలని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్పిన మూడు రోజులకే ఈ చర్య తీసుకున్నారు. మూడు నెలల వయసున్న పిల్లలను ఈ ఉయ్యాలలో వేయద్దని సేఫ్టీ కమిషన్ తో పాటు ఫిషర్ -ప్రైస్ సంస్థ కూడా కోరింది.
2011 నుంచి 2018 వరకు 32 మంది పిల్లలు వీటిలో దొర్లుతూ మరణించారని ఏఏపీ తన ప్రకటనలో పేర్కొంది. మూడు నెలల కంటే తక్కువ వయసున్నవారు కూడా వీళ్లలో ఉన్నారంది. అందువల్ల ఈ ఉత్పత్తి ప్రమాదకరమని, వెంటనే ఉపసంహరించాలని ఏఏపీ అధ్యక్షుడు కైల్ యసుడా కోరారు. ఆరు నెలలు లేదా అంతకంటే తక్కువ సమయానికి ముందు వీటిని కొన్నవారికి డబ్బులు కూడా తిరిగివ్వాలని కొందరు న్యాయవాదులు చెబుతున్నారు. వాళ్లు కొని ఎంత ఎక్కువ కాలం అయితే వారికి అంత తక్కువ మొత్తం తిరిగి వస్తుంది.