మైసూరు: ఉదయం లేవగానే తయారు చేసేందుకు సులువగా, తినేందుకు వీలుగా ఉండేది ఇడ్లీ మాత్రమే. ఉదయం తినే అల్పాహారాల్లో మొదటి స్థానంలో ఇడ్లీనే ఉంటుంది. చట్నీ, సాంబార్, నెయ్యి, కారప్పొడి దేనితో తిన్నా వారెవ్వా అనాల్సిందే. అయితే ఇంట్లో కానీ బయట కానీ నాలుగు నుంచి ఆరు ఇడ్లీలకు మించి తినలేం. అయితే, ఓ 60 ఏళ్ల బామ్మ మాత్రం నిమిషంలో 6 ఇడ్లీలు తినేసి అందరిని ఆశ్చర్య పరిచింది.
దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం కర్ణాటకలోని మైసూరులో మహిళలకు ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఇందులో పలువురు మహిళలు పోటీ పడ్డారు. అయితే, సరోజమ్మ అనే 60 ఏళ్ల బామ్మ నిమిషంలో ఆరు ఇడ్లీలు లాగించేసి విజేతగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మైసూరులో దసరా ఉత్సవాలను వైభంగా నిర్వహిస్తారు. అక్కడి దుర్గా నవరాత్రులు వివిధ కార్యక్రమాలు, ఏర్పాట్లతో దేశ విదేశీ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మైసూరు దసరా మహోత్సవం భారత దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జరిగే దసరాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుంది. దసరా ఉత్సవాలను పది రోజులపాటు నిర్వహిస్తారు. ఈ సారి సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 8 వరకు వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను తిలకించడానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని నలువైపుల నుంచి కూడా పర్యాటకులు మైసూరుకు వస్తుంటారు.