(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని ఏసీబీ స్పష్టం చేసింది. అజిత్ పవార్ కు ఊరట కల్పిస్తూ.. ఆయనపై ఉన్న వేల కోట్ల రూపాయల కుంభకోణం కేసులో ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. సాగునీటి కుంభకోణం కేసులో విచారణను మూసివేస్తున్నట్లు మహారాష్ట్ర ఏసీబీ ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఏసీబీ అధికారులు స్పందించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన తొమ్మిది కేసులను మూసేశామని, ఈ కేసులతో అజిత్ పవార్ కు ఎలాంటి సంబంధం లేదని ఏసీబీ సీనియర్ అధికారి పరంబిర్ సింగ్ తెలిపారు. సాగునీటి సంబంధిత ఫిర్యాదులలో సుమారు మూడు వేల టెండర్లను పరిశీలిస్తున్నామని, వీటి విచారణ జరుగుతోందని చెప్పారు. అజిత్ కు సంబంధించిన ఏ కేసునూ మూసివేయలేదని స్పష్టం చేశారు. తాజాగా మూసివేసిన కేసులు.. అజిత్ పవార్ కు సంబంధించినవి కాదని పేర్కొన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ రెండు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేశారు. ఓ వైపు ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలోనే అనూహ్యంగా ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి బీజేపీకి మద్దతు పలికారు. శనివారం(నవంబర్ 23) మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.
కాంగ్రెస్ – ఎన్సీపీ అధికారంలో ఉన్న సమయంలో విదర్భ ఇరిగేషన్ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అజిత్ పవార్ సుమారు రూ.70వేల కోట్ల పథకంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు సహకార బ్యాంకు కుంభకోణంలో శరద్ పవార్, అజిత్ పవార్ లపై ఈడీ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత ఈ కేసుకు సంబంధించి అజిత్ పవార్ ను అరెస్టు చేస్తారని ఫడ్నవీస్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు.
మరోవైపు కేసులను దృష్టిలో ఉంచుకునే బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చారని… ఇదంతా డీల్ లో భాగమేనని కాంగ్రెస్, శివసేన పార్టీలకు చెందిన నాయకులు అంటున్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పాటుకు అజిత్ మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే ఇలా చేశారంటూ పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.