శ్రీధరన్ ఫేస్బుక్ కవర్ ఫొటో
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశంలో సంకుచిత మెజారిటీ మతవాదం విజృంభిస్తున్న వేళ, ముస్లింలలో అభద్రతాభావం అంతకంతకూ పెరుగుతున్న వేళ మతం హద్దులను చెరిపివేసి మానవత్వపు పరిమళాలను వెదజల్లిందో తల్లీ కొడుకుల బంధం.
కేరళలోని కలివాక్కులో ఓ పెద్దామె మరణించింది. ఒమన్లో ఉద్యోగం చేసుకుంటున్న ఆమె కుమారుడు శ్రీధరన్ ఫేస్బుక్లో ఒక పోస్టు పెట్టాడు. ఇదీ విషయం. అర్ధం అయ్యీ అవనట్లు ఉంది కదూ. నాలుగు దశాబ్దాలు వెనక్కి వెళ్లాలి మనం. శ్రీధరన్, అతని ఇద్దరు అక్కలను అనాధలు చేసి వారి తల్లి చక్కి మరణించింది. అప్పుడు శ్రీధరన్ ఏడాది పిల్లవాడు.
అబ్దుల్ అజీజ్ హాజీ, అతని భార్య సుబైదా తెన్నాడ్ ఆ ముగ్గురు పిల్లలనూ తమ ముగ్గురు సంతానంతో పాటు పెంచారు. వారిద్దరూ సాంప్రదాయక ముస్లింలైనప్పటికీ తమ పెంపుడు సంతానాన్ని హిందూ ఆచారాలతోనే పెంచి పెద్ద చేశారు. శ్రీధరన్ అక్కలు రమణి, లీలాలకు పెళ్లి చేశారు. శ్రీధరన్కు ఇప్పుడు 46 ఏళ్లు.
‘వారు మాకు పెంపుడు తల్లిదండ్రులు కారు. మా సొంత అమ్మానాన్న కిందే లెక్క. అట్లాగే పెంచారు మమ్మల్ని. విద్యాబుద్ధులు నేర్పించారు. పెళ్లిళ్లు చేశారు. ఏమీ తెలియని వయసు నుంచీ మమ్మల్ని పెంచుకున్నప్పటికీ మా మతం మార్చేందుకు ఎప్పుడూ చూడలేదు’ అని శ్రీధరన్ తన ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నాడు. ‘మా అమ్మ అల్లా పిలుపును స్వీకరించి వెళ్లిపోయింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రార్ధించండి’ అంటూ అతను పెట్టిన పోస్టు చాలామందిని కదిలించింది. అమ్మతనం, మానవత్వం మతం సరిహద్దులకు అతీతమని నిరూపించింది.
Courtesy: The Hindu