(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. బీజేపీ, ఆప్, కాంగ్రెస్లు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వచ్చే నెలలోనే ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ స్పీడ్ పెంచింది. బీజేపీ, కాంగ్రెస్ లాంటి ప్రధాన ప్రతిపక్షాల కంటే ముందే ఆప్ తమ అభ్యర్ధులను ప్రకటించింది. మరోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాదు అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామంటూ ప్రత్యర్ధులకు సవాల్ విసురుతోంది. నామినేషన్లు ప్రారంభమైన తొలి రోజే(జనవరి 14).. ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో అభ్యర్థులను ఖరారు చేసి ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు సీఎం కేజ్రీవాల్. సిట్టింగ్ ల్లో 15 మందికి టికెట్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ నిరాకరించారు. 46 స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్లు దక్కాయి. కేజ్రీవాల్ సిట్టింగ్ మంత్రులను ఎవర్నీ పక్కనబెట్టలేదు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కొందరు నేతలకు ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించింది. 23 కొత్త ముఖాలకు టికెట్లు ఇచ్చిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ నుంచి తమ పార్టీలో చేరిన ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఇచ్చారు.
సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పట్పర్గంజ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో ఐదుగురు మహిళలకు అవకాశం కల్పించగా ఈసారి ఎనిమిది మందికి సీట్లు కేటాయించింది. 2015 ఎన్నికల్లో చాందినీ చౌక్ నుంచి గెలుపొందిన అలకా లంబా గత ఏడాది కాంగ్రెస్లో చేరారు. లంబా స్థానంలో చాందినీ చౌక్ టికెట్ను ప్రహ్లాద్ సింగ్ సాహ్నికి ఆప్ కేటాయించింది. గతంలో కాంగ్రెస్లో పని చేసిన సాహ్ని.. 1998, 2003, 2008, 2013 ఎన్నికల్లో చాందినీ చౌక్ నుంచి విజయం సాధించారు. 2015 ఎన్నికల్లో లంబా చేతిలో ఓడిన ఆయన.. గత ఏడాది అక్టోబర్లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన కాంగ్రెస్ నేత షోయబ్ ఇక్బాల్ జనవరి 10న ఆప్లో చేరగా.. ఆయనకు కూడా టికెట్ దక్కడం గమనార్హం. ప్రజలకు ఆప్పై విశ్వాసం ఉందని, కష్టపడి పనిచేయాలని కేజ్రీవాల్ అభ్యర్థులకు సూచించారు.
మరోవైపు ఎన్నికల తేదీలు కూడా సమీస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాలకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ తన అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీలో కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల్లో గెలిచేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో బాలీవుడ్, భోజ్పురి తారలతో పాటు పలువురు కళాకారుల పేర్లు ఉన్నాయి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ మాత్రం మూడు సీట్లకే పరిమితమైంది. ఈ సారి హస్తినలో పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. దీంతో ఈ ఎన్నికలు నువ్వా? నేనా ? అనేలా జరగనున్నాయి.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. అదే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. కోటీ నలభై ఆరు లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. దేశ రాజధానిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.