నాసిక్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ భగవాన్ మహావీర్ అహింస పురస్కార్ను అందుకోబోయే మొట్టమొదటి వ్యక్తిగా ఉంటారని అఖిల్ భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి ఆదివారం తెలియజేసింది.
అఖిల్ భారతీయ దిగంబర్ జైన్ మహాసమితి (న్యూఢిల్లీ) చైర్పర్సన్ మణీంద్ర జైన్ యుద్ధ విమాన పైలట్ పురస్కారంను అభినందన్కు ప్రకటించారని మహారాష్ట్ర చాప్టర్ కన్వీనర్ పరాస్ లోహడె తెలియజేశారు.
మహవీర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 17న ఈ అవార్డును అభినందన్కు ప్రధానం చేయనున్నారు. రెండు లక్షల 51వేల రూపాయల నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేయనున్నట్లు లోహడె తెలిపారు.
ఫిబ్రవరి 27న గగనతలంలో జరిగిన డాగ్ ఫైట్లో అభినందన్ వర్థమాన్ మిగ్ 21 యుద్ధ విమానంతో ఆర్73 మిస్సైల్ను ప్రయోగించి పాకిస్థాన్ ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని కూల్చివేశారు.
మిగ్ 21 యుద్ధ విమానం కూడా కూలిపోవడంతో అభినందన్ పాకిస్థాన్ దళాలకు పట్టుబడ్డాడు. మార్చి ఒకటిన అభినందన్ను పాక్ అధికారులు భారత్కు అప్పగించారు.