న్యూఢిల్లీ: గర్భిణులు అబార్షన్లు చేయించుకునే కాల పరిమితి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 20 వారాల వరకు గర్భం ఉన్నవారికి మాత్రమే అబార్షన్లు చేయించుకునే వెసులుబాటు ఉండగా.. ఇకపై ఈ కాల పరిమితిని 24 వారాలకు పెంచారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. మహిళలు గర్భాన్ని తొలగించుకునే పరిమితిని 24 వారాలకు పెంచడం ద్వారా వారి పునరుత్పత్తి హక్కులను కాపాడినట్టవుతుందని ఆయన తెలిపారు. మొదటి ఐదు నెలల (20 వారాలు) తర్వాత శారీరక ఇబ్బందులు ఎదుర్కొనే గర్భిణులు… ఆ తర్వాత అబార్షన్ చేయించుకోవాలంటే కోర్టులకు వెళ్లాల్సి వస్తోందని… ఈ నేపథ్యంలో అబార్షన్ కు నాలుగు వారాల గరిష్ట పరిమితిని పెంచడం వారి హక్కులను కాపాడటమేనని చెప్పారు. 1971 నుంచీ మెడికల్ టెర్మినాలజీ ఆఫ్ ప్రెగెన్సీ చట్టం ఎలాంటి సవరణలకూ నోచుకోలేదని ప్రకాష్ జావదేకర్ అన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని సవరించాల్సి వచ్చిందని ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
ఈ మేరకు మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగెన్సీ చట్టంలో సవరణలకు సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ సవరణ ప్రతిపాదనలు త్వరలో బిల్లు రూపంలో పార్లమెంట్ ముందుకు రానున్నాయి.