విజయవాడ: గత కొన్నాళ్లుగా బ్యాక్ పెయిన్తో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేచర్ క్యూర్ పద్ధతి(ప్రకృతి వైద్యం)లో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా కొద్దిరోజులుగా.. పవన్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఏ కార్యక్రమంలో కూడా పాల్గొనటం లేదు. ఇటీవల పవన్ ను పరీక్షించిన వైద్యులు.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించారు. అయితే, సర్జరీకి పవన్ కల్యాణ్ అంగీకరించలేదు. ఆయన ప్రకృతి సిద్ధమైన వైద్యానికే సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వెన్నునొప్పి పూర్తిగా తగ్గగానే పవన్ మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని జనసేన పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ సమయంలో ఆయన వెన్నుపూసలకు తీవ్రగాయాలు కావడంతో తరచు ఆయనను వెన్నునొప్పి బాధిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అది కొంచెం పెరిగింది. అయితే, పవన్ అశ్రద్ధ చేయడంతో నొప్పి తీవ్రత పెరిగింది. ఈ కారణంగానే ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకాలేదు. ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల వ్యక్తి గతంగా హజరు కాలేకపోతున్నట్లు పవన్ వెల్లడించిన సంగతి తెలిసిందే.