(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహిళల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన దిశ చట్టంపై సర్వత్ర ప్రశంసలు లభిస్తున్నాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవితోపాటు పలువురు దిశ చట్టంపై అభినందనలు తెలిపారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని రాశీ పేర్కొంది. ఈ చట్టం వల్ల తప్పు చేస్తే చనిపోతాం అనే భయం ఉంటుందని, దీంతో తప్పు చెయ్యాలనుకునే వారు భయపడతారని అభిప్రాయపడింది. అంతేకాదు ఈ చట్టాన్ని మిగిలిన రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని.. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాలని రాశీ ఖన్నా వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఇతర రాష్ట్రాలు చాలా నేర్చుకోవాలి – హీరోయిన్ రాశి ఖన్నా#APDishaAct#DishaActByYsjagan pic.twitter.com/dX9wL9FWpa
— 2024YSRCP (@2024YSRCP) December 15, 2019
కాగా, మహిళపై అత్యాచారానికి పాల్పడేవాళ్లకు సత్వరమే కఠిన శిక్ష విధించేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీలో దిశ చట్టాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం(డిసెంబర్ 13) ఏపీ శాసనసభ ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా యాక్ట్- 2019, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కు ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు నేరం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు. కొత్త చట్టం ప్రకారం.. నేరాన్ని నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెల్లడిస్తారు. వారం రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి.. మరో 14 రోజుల్లో విచారణ పూర్తి చేస్తారు. మొత్తం 21 రోజుల్లో అత్యాచారం కేసుపై కోర్టు తీర్పు వస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ కొత్త బిల్లును రూపొందించిన సంగతి తెలిసిందే.