అమరావతి: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని.. తన తప్పుంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో డిసెంబర్ 6నే విచారణకు హాజరుకావాలని జమ్మలమడుగు డీఎస్పీ ఫోన్ ద్వారా కోరారని.. డిసెంబర్ 6న తాను ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. విచారణకు హాజరైన వారికి 61ఏ కింద నోటీసులు ఇచ్చారు.. తనకు మాత్రమే 161 సీఆర్సీ కింద నోటీసులు ఇవ్వడమేంటి ? అని ప్రశ్నించారు. తాను అజ్ఞాతంలో ఉన్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. వైఎస్ వివేకా హత్య జరిగిన సమయంలో తాను విజయవాడలో ఉన్నానని.. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో వారి అంతరాత్మకే తెలుసని వ్యాఖ్యానించారు.
బుధవారం లేదా గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకమ్మని సిట్ కోరిందని తెలిపారు. టీడీపీ హయాంలో సిట్ వద్దు సీబీఐ కావాలని అడిగినవారు నేడు సిట్ కావాలని అడగటం వెనుక ఆంతర్యం ఏమిటి ? అని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు. సిట్ పైన ఎవరికీ అవగాహన లేదు.. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసులో ఒక్క శాతం పాత్ర నాది ఉన్నా పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని సవాల్ చేశారు. వైఎస్ కుటుంబం తనపై కక్ష కట్టిందని, జాగ్రత్తగా ఉండాలని చాలా మంది తనతో చెప్పారని తెలిపారు. ‘నాది తప్పుంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చు… నేను కనిపించకుండా దాక్కోవడానికి చీమను కాను.. నేను మనిషినే.. ఇష్టం వచ్చినట్లు నాపై ఆరోపణలు చేయడం తగదు’అని ఆదినారాయణ రెడ్డి హెచ్చరించారు.
మరోవైపు వివేకా హత్యకేసులో విచారణకు రావాలని ఆదినారాయణరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపిన నేపథ్యంలో ఆయన సిట్ ముందు హాజరుకానున్నారు. ఇప్పటికే రెండుసార్లు ఆయనకు నోటీసులు పంపగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. అయితే, తన లాయర్ల సలహా తీసుకున్న ఆయన.. సిట్ ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. సిట్ నోటీసులపై స్పందించిన ఆది.. కడపకు వెళ్లి సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాబోతున్నారు.
ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ-వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. వివేకానంద హత్య తర్వాత అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం విచారణకు సిట్ను నియమించింది. ఈ కేసులో చాలా మంది అనుమానితులను సిట్ ప్రశ్నించింది. ఇటీవల బీటెక్ రవి, నారాయణరెడ్డి కూడా విచారించింది. దర్యాప్తుకు సహకరించాలని, విచారణకు రావాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కోరింది. రెండుసార్లు పిలిచినా.. ఆదినారాయణ రెడ్డి మాత్రం హాజరుకాలేదు. వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందా ? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ సారి విచారణ హాజరు కాకపోతే ఆదిని అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా ఆయన విచారణ హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఈ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి అనుమానితులతో పాటూ సాక్ష్యుల్ని వరుసగా విచారణకు పిలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరి, ప్రకాష్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. వివేకా హత్య జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులు దొరకలేదు. ఇటు సీఎం సొంత బాబాయ్ హత్య నిందితులను పట్టుకోవడం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో సిట్ విచారణ వేగవంతం చేసింది.