కడప: మాజీమంత్రి, వైసీపీ నేత వివేకానంద రెడ్డి హత్యకేసులో గురువారం మాజీమంత్రి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. వివేక కేసులో విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీచేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనతో పాటుగా వివేక వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు.
వివేకా హత్య కేసులో తన పాత్ర ఉందని నిరూపిస్తే పులివెందుల నడిబొడ్డున ఉరి తీసుకుంటానని.. తన తప్పుంటే ఎన్కౌంటర్ చేసుకోవచ్చని బుధవారం మీడియా సమవేశంలో ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆదినారాయణ రెడ్డిని సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్నలు వేస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటి నుంచి.. వివేకా హత్య వరకు, అనంతరం జరిగిన పరిణామాలపై ఆదిని సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. టీడీపీ-వైఎస్సార్సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. వివేకానంద హత్య తర్వాత అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో నాటి టీడీపీ ప్రభుత్వం విచారణకు సిట్ను నియమించింది. గత తొమ్మిది నెలలుగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు చాలా మంది అనుమానితులను ప్రశ్నించింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా విచారించింది. ఈ కేసు విచారణకు రావాలని ఆదినారాయణరెడ్డికి రెండుసార్లు పిలిచినా.. ఆయన మాత్రం హాజరుకాలేదు. వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ సారి విచారణ హాజరు కాకపోతే ఆదిని అరెస్టు చేస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, తాజాగా ఆయన విచారణ హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు ఈ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి అనుమానితులతో పాటూ సాక్ష్యుల్ని వరుసగా విచారణకు పిలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరి, ప్రకాష్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటివరకు 1300 మంది అనుమానితులను ప్రశ్నించినట్టు సిట్ అధికారులు చెబుతున్నారు. వివేకా హత్య జరిగి తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు ఈ కేసులో నిందితులు దొరకలేదు. ఇటు సీఎం సొంత బాబాయ్ హత్య నిందితులను పట్టుకోవడం లేదని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో సిట్ విచారణ వేగవంతం చేసింది.