పట్నా: కాంగ్రెస్ పార్టీలో చేరేముందు తాను అద్వానీ ఆశీస్సులు తీసుకున్నానని, ఆ సమయంలో ఆయన కళ్ల నీళ్లు పెట్టుకున్నారే తప్ప వెళ్లొద్దని మాత్రం అనలేదని ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న శతృఘ్న సిన్హా చెప్పారు. ‘ఓకే, ఐ లవ్యూ’ అని మాత్రమే ఆయన అన్నారని శతృఘ్న సిన్హా తెలిపారు.
అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో తాను బీజేపీలో చేరానని, అప్పటికి ఇప్పటికి ఆ పార్టీలో తేడా ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి ఉన్న తేడాయేనని వ్యాఖ్యానించారు. బీజేపీ అధిష్ఠానం సీనియర్లను సరిగా గౌరవించడం లేదని, అందుకు అద్వానీ, వాజ్ పేయీ తదితరులే నిదర్శనమని శతృఘ్న సిన్హా చెప్పారు. గుజరాత్ లోని గాంధీనగర్ టికెట్ అద్వానీకి గానీ, ఆయన కుమార్తెకు గానీ ఇవ్వని విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పోటీ చేస్తున్నారు. తాను మాత్రం అద్వానీలా ఎప్పుడూ వాళ్ల ముందు తల వంచనని, వాళ్లు కూర్చోమంటే కూర్చోవడం తన వల్ల కాదని శతృఘ్న సిన్హా అన్నారు.
ఎన్నికలలో బాలాకోట్ వైమానిక దాడుల ప్రభావం ఏమైనా ఉంటుందా అన్న ప్రశ్నకు.. ప్రతి భారతీయుడూ జాతీయవాదేనని సమాధానమిచ్చారు. కానీ ప్రధానమంత్రి మాత్రం నిరుద్యోగం గురించి అడిగితే పుల్వామా గురించి మాట్లాడతారని, ప్రజల ప్రశ్నలకు ఆయనెందుకు సమాధానం ఇవ్వడం లేదని శతృఘ్న సిన్హా అడిగారు. మే 23 తర్వాత మోదీ ప్రధానిగా ఉండబోరని స్పష్టం చేశారు. ఆయన గడువు ముగిసిందన్న విషయాన్ని ఐరన్ లేడీ మమతా బెనర్జీ సరిగ్గానే చెప్పారన్నారు. తన జోలె పట్టుకుని హాయిగా వెళ్లిపోతానని గతంలో మోదీ అననారని, ఇప్పుడు ఆ జోలె పట్టుకోవాల్సిన సమయం వచ్చిందని శతృఘ్న సిన్హా చెప్పారు.