(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాదు అతలాకుతలం అవుతోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్లు వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. వర్ష బీభత్సానికి 12 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.హైదరాబాదులో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ఘట్కేసర్లో అత్యధికంగా 32 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. తరువాత వరుసగా హయాత్నగర్లో 29.8 సెంటీ మీటర్లు, హస్తినాపురంలో 28.4. సరూర్నగర్ల 27.3, అబ్దుల్లాపూర్మెట్ లో 26.6, కీసరలో 26.3, ఇబ్రహీంపట్నంలో 25.7, ఓయూలో 25.6, ఉప్పల్లో 25.6, మేడిపల్లిలో 24.2. కందికల్గేట్ – 23.9, రామంతాపూర్ 23.2, బేగంపేటలో 23.2, మల్కాజ్గిరి లో 22.6, అల్వాల్లో 22.1, అసిఫ్నగర్లో, సైదాబాద్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్లలో 20 సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదు అయ్యింది. 1903వ సంవత్సరం తరువాత హైదరాబాదు లో ఈ స్థాయిలో వర్షాలు పడటం, వరదలు రావడం ఇదే ప్రధమం. మరో రెండు రోజులు కూడా హైదరాబాద్కు ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారీ వర్షాలకు హైదరాబాద్లో ఆంక్షలు ఇవి..
భారీ వర్షాలతో నగరంలో ట్రాఫిక్ను మళ్లించారు. చాలా ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అరంఘర్ చౌరస్తాకు సమీపంలో హైదరాబాద్ – కర్నూలు జాతీయ రహదారి పూర్తిగా నీటితో నిండిపోయింది. నీరు తగ్గే వరకూ ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. విమానాశ్రయం, జాతీయ రహదారి 44 లోని కర్నూర్ నుండి షాద్నగర్ వైపై వెళ్లే వాహనాలను ఓటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. పివిఆర్ ఎక్స్ప్రెస్ మార్గంపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. మెహిదీపట్నం నుండి గచ్చిబౌలి వైపు వెళ్లాలనుకే వాహనదారులు టోలిచౌకి ఫ్లైఓవర్ నుండి కాకుండా సెవెన్ టూంబ్స్ రహదారిప వెళ్లాలని పోలీసులు సూచించారు. మూసి నుండి వరద పోటెత్తడంతో పురానాపూల్ వద్ద వంద అడుగుల రహదారి పూర్తిగా ముసివేశారు. ఈ దారిని కాకుండా ప్రత్యామ్నాయంగా వాహనదారులు కార్వాన్ వైపునకు మళ్లించారు. అంబర్పేట వద్ద అలీకేఫ్, అంబర్పేట రహదారి మధ్య మూసారంబాగ్, అర్టీఏ అఫీసు వంతెనను పూర్తిగా మూసివేశారు. ఈ మార్గాల్లో వెళ్లాల్సిన ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ఫలక్సుమా రైల్వే బ్రిడ్జిని పూర్తిగా మూసివేశారు. ఈ రహదారిన వెళ్లాల్సిన ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని పోలీసులు సూచించారు.
రామాంతపూర్ చెరువు నిండి రోడ్ల మీదకు నీరు రావడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. చెరువు నిండి సమీప కాలనీల్లోకి నీరు చేరుకున్నది. హిమాయత్సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండుకోవడంతో అక్కడి నుండి గేట్లు ఎత్తినీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ముసినది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు. వరద, వర్ష బీభత్సం కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలకు నేడు, రేపు సెలవులను ప్రకటించింది ప్రభుత్వం. సహాయక చర్యలకు గానీ ఆర్మీ, ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది.
వరద ప్రాంతాల్లో మంత్రి కెటిఆర్ పర్యటన
భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులు అందరూ క్షేత్రస్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. మేయర్, డిప్యూటి మేయర్, కార్పోరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వరద ప్రభావిత ప్రాంత ప్రజలను కమ్యూనిటీ హాళ్లకు తరలించాలని సూచించారు. బస్తీ దవాఖానాల్లోని డాక్టర్లు ఇతర సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. మంగళవారం ఉదయం నుండి నగరంలో చాలా ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కరెంటు సరఫరా పునరుద్ధరణకు విద్యత్ సంస్థలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అనంతరం కేటీఆర్ డీజీపీతో కలిసి ఎల్బి నగర్ ఏరియాలో పర్యటించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.