జాతీయ అవార్డులకు మన సినిమా రంగంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కెరీర్లోఓ సారైనా జాతీయ అవార్డును సొంతం చేసుకోవాలని నటీనటులు కలలు కంటారు. మన దక్షిణాది విషయానికి.. ముఖ్యంగా మన తెలుగు సినిమా విషయానికి వస్తే.. కమర్షియల్ విలువలకే పట్టం కడతారంటూ జాతీయ అవార్డు కమిటీ మన సినిమాలపై శీతకన్ను వేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. రెండు, మూడేళ్లుగా తెలుగు సినిమా పరిస్థితి మారుతోంది. కొత్త కొత్త కథాంశాలున్న సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమాలంటే ప్రేక్షకుడు కొత్తదానికి పెద్ద పీట వేస్తున్నాడు. అందుకే స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.
గత ఏడాది ఇండియన్ సినిమాలోని బయోపిక్ హవాను కొనసాగిస్తూ టాలీవుడ్లో రూపొందిన చిత్రం `మహానటి`. అలనాటి అగ్ర కథానాయిక సావిత్రి బయోపిక్ ఇది. ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి.. కష్టాలకు ఎదురీది అగ్రతారగా ఎదిగిన సావిత్రి..చివరినాళ్లలో ఎన్నో నాటకీయ పరిస్థితులను చవిచూసి కన్నుమూశారు. ఈ నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని సావిత్రి గురించి తెలియని నేటి తరానికి ఆమె గురించి చెప్పే ప్రయత్నం చేసింది దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీం.
సావిత్రి పుట్టిన ఊరు, పెరిగిన వాతావరణం, స్నేహితులు, ఆమె స్టార్గా ఎదిగిన తీరు.. ఆమెకు వెన్నంటి నిలిచినవారు, ఆమెను మోసం చేసినవారు, ఆమె ఎదుర్కొన కష్టనష్టాలు ఇలా చాలా విషయాలు సేకరించిన యూనిట్కి పెద్ద చిక్కు అసలు సావిత్రి పాత్రధారిగా ఎవరన్నదగ్గర మొదలయింది.
ఎవరినో నటింప చేయడం కాదు.. ఆ పాత్రలో జీవింప చేయాలి. లేకుంటే పడ్డ కష్టానికి ఫలితం దక్కదు. జల్లెడ పట్టిన యూనిట్కు దొరికిన వజ్రం కీర్తిసురేశ్. అసలు కీర్తి సురేశ్లాంటి అప్కమింగ్ హీరోయిన్ అలనాటి తారను మైమరిపించేలా ప్రేక్షకులను నటిస్తుందా? ఇలాంటి సందేహాలు సామాన్య ప్రేక్షకుడి ఎన్నో వచ్చాయి. అయితే ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత అరే! కీర్తి సురేశ్ చూడటానికి సావిత్రిలా ఉందే అనే భావన అందరిలోనూ ఏర్పడింది. ఇక సినిమా సినిమా విడుదలైన తర్వాత ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులు సావిత్రి మాయలో పడిపోయారు. అంతలా కీర్తిసురేశ్ అలనాటి తార పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసింది.నాగ్ అశ్విన్ టీమ్ కష్టం అంతా మరచిపోయేలా ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
కేవలం ప్రేక్షకులే కాదు.. ఇప్పుడు జాతీయ అవార్డ్ కమిటీ జ్యూరీ కూడా కీర్తి సురేశ్ నటనకు ఫిదా అయ్యారు. 66వ జాతీయ అవార్డ్స్లో తొలిసారి ఓ తెలుగు సినిమా హీరోయిన్కు ఉత్తమనటిగా అవార్డు వచ్చింది. ఈ విశిష్టమైన గుర్తింపు దక్కి 28 ఏళ్లు అవుతుండటం విశేషం. 1990లో కర్తవ్యం సినిమాలో విజయశాంతి ఉత్తమనటి అవార్డుని దక్కించుకుంది. తర్వాత ఇన్నేళ్లకు కీర్తిసురేశ్కు ఈ అవార్డు రావడం విశేషం. ఈ అవార్డుని తన తల్లికి, తండ్రికి అంకితమిస్తున్నానని కీర్తిసురేశ్ చెప్పింది. సావిత్రి పాత్రధారిగా నటించాలన్నప్పుడు ఆమె మానసికంగా ఎంత సంఘర్షణకులోనయ్యారో కూడా చెప్పుకొచ్చింది కీర్తిసురేశ్. ఏదైతేనేం .. అలనాటి తారను మరపింపచేస్తూ నటించిన కీర్తిసురేశ్ కీర్తి కీరిటంలో ఈ అవార్డ్ ఒక వజ్రంలా ఒదిగింది.
previous post