విజిటర్లు లేక మూగబోయిన వార్డు
అంతకుముందు భారీగా సందర్శకులు
రాంచీ: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత.. లాలు ప్రసాద్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద అంతా నిశ్శబ్ద వాతావరణం కనిపిస్తోంది. గత తొమ్మిది నెలలుగా ఆయన రాంచీలోని రాజేంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. టీవీ శబ్దం మాత్రం పెద్దగా వినిపిస్తోంది. ఆర్జేడీకి రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా రాలేదు. కొందరు ఎస్ఐలు మాత్రం వీఐపీ ఖైదీ ఉన్న గది వద్ద కనిపిస్తూ ఉన్నారు. ఇదీ అక్కడి పరిస్థితి. దీనిపై ‘ఇండియన్ ఎక్స్ ప్రెస్’లో అభిషేక్ అంగద్ ఓ కథనం రాశారు. అందులోని వివరాలిలా ఉన్నాయి..
14 ఏళ్ల జైలుశిక్ష పడిన లాలు ప్రసాద్.. ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోరులో గల ఒకటో నెంబరు వార్డులో ‘పరిశీలన’ కోసం ఉన్నారు. లాలు ఆర్జేడీకి ప్రచారం చేయకుండా ఉన్న మొట్టమొదటి ఎన్నికలు ఇవే. లాలు ఉంటే అక్కడి కులసమీకరణలను చక్కగా చూడగలిగే వాళ్లని, కానీ ఆర్జేడీ – కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్నా ప్రచారంలో ఆయన మ్యాజిక్ లేకపోవడంతో ఎన్డీయే కూటమి బిహార్ లోని 40 స్థానాలకు గాను 39 ఎగరేసుకుపోయిందని అంటున్నారు. ‘‘ఇది మోదీ సునామీ’’ అంటూ టీవీలో యాంకర్ గట్టిగా చెబుతుంటే, ఆసుపత్రిలో ఉన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులలో ఒకరైన అజయ్ సింగ్ కూడా.. ‘మోదీ మళ్లీ వచ్చేశారు’ అని గట్టిగా చెప్పారు. లాలు కోసం వచ్చే సందర్శకులతో ఆసుపత్రి కిటకిటలాడిపోయేదని బెగుసరాయ్ ప్రాంతానికి చెందిన అజయ్ సింగ్ చెప్పారు. దారిన పోయేవాళ్లు కూడా వచ్చి ఆయనను కలిసేవాళ్లని అన్నారు. లాలు కూతురు మీసాభారతి వచ్చినపుడైతే ఆసుపత్రి బయట పెద్ద మొత్తంలో జనం వచ్చారని చెప్పారు. మార్చిలో శతృఘ్నసిన్హా కూడా వచ్చారు.
గత 35 వారాలుగా లాలు భార్య రబ్రీదేవి, కొడుకు తేజస్వి, హమ్ పార్టీ అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ, ఎల్జేడీ అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆర్ఎల్ఎస్పీ అధ్యక్షుడు ఉపేంద్ర కుశ్వాహా తదితరులు వచ్చి వెళ్లారు. ఆసుపత్రి అంతా రాజకీయ సమావేశాల వేదికగా మారిపోయింది. దాంతో లాలు ఆసుపత్రి నుంచే రాజకీయాలు చేస్తున్నారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆరోపించారు. దాంతో, శాంతి భద్రతల సమస్యల దృష్ట్యా విజిటర్ల సంఖ్యను పరిమితం చేస్తున్నట్లు జైలు అధికారులు ఏప్రిల్ 20న ఒక నోటీసు అతికించారు. ఇప్పుడు ప్రతి శనివారం ముందస్తు అనుమతతితో ముగ్గురు విజిటర్లను మాత్రం అనుమతిస్తున్నారు. అలా అనుమతి దొరకనివాళ్లలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు.
లాలు ఎలా ఉన్నారని అడిగితే, ఆయనను తాము బాగానే చూసుకుంటున్నామని.. ఇంతకంటే ఏమీ చెప్పలేనని జైలు సూపరింటెండెంట్ అశోక్ చౌదరి చెప్పారు. వీఐపీ ఖైదీలలో ఇంత ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉన్నది లాలు ఒక్కరే. లాలు వార్డు చిన్నపాటి ఇంటిలాగే ఉంటుందని, అందులో చిన్న కిచెన్, మంచం అన్నీ ఉంటాయని అక్కడి ఉద్యోగి ఒకరు తెలిపారు. రాజకీయ కారణాల వల్లే లాలు సందర్శకుల సంఖ్య తగ్గించారని అక్కడ పనిచేసే వైద్యుడొకరు అంగీకరించారు. ఇప్పుడిక బీజేపీ నెగ్గింది కాబట్టి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని అన్నారు. ఫలితాలు రావడానికి ఒక్కరోజు ముందు లాలు పెద్దకుమార్తె మీసాభారతి అక్కడికి వచ్చారు. తన తండ్రికి కాలి మీద గాయం అయిందని ఆమె చెప్పారు. ఆమె పాటలీపుత్ర స్థానంలో ఓడిపోయారు.
ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రం అసలు అక్కడకు విజిటర్లే లేకుండా పోయారు. ఫలితాలు చూసి లాలూజీ బాగా నిరాశ చెందారని అక్కడున్న ఓ గార్డు అన్నారు. ఆయన ఎవరితోనూ మాట్లాడటం లేదని, టీవీ కూడా పెట్టడం లేదని చెప్పారు. నరేంద్రమోదీకి మద్దతుగా ఉండే కొందరు డాక్టర్లు లాలు ఉన్న భవనం వెలుపల టపాసులు కూడా కాల్చారని ఒక ఉద్యోగి చెప్పారు.