పంజాబ్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్ ప్రభుత్వం ఆరాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదించింది. వివాదాస్పద సీఏఏను రద్దు చేయాలని పంజాబ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఇప్పటికే కేరళ అసెంబ్లీలనూ సీఏఏకు వ్యతిరేకంగా ఆరాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని ఆమోదించింది. తాజాగా పంజాబ్ కూడా కేరళ దారిలోనే వెళ్లింది. ఆరాష్ట్ర మంత్రి బ్రహ్మ్ మోహింద్రా .. సీఏఏకు వ్యతిరేకంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. పార్లమెంట్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయని, పంజాబ్లోనూ హింస చోటుచేసుకున్నదని మంత్రి తెలిపారు. అందుకే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసిన రెండో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది.
ఇటీవలే కేరళ అసెంబ్లీ కూడా సీఏఏను వ్యతిరేకిస్తూ తీర్మానం పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని అధికార సీపీఐ (ఎం)-ఎల్డీఎఫ్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రతిపక్ష యూడీఎఫ్ సమర్థించాయి. అయితే బీజేపీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజగోపాల్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. పౌరసత్వ చట్టం రద్దు తీర్మానాన్ని ఆమోదించేందుకు కేరళ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 31న ప్రత్యేకంగా ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అంతేకాదు సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంలో కేరళ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏపై న్యాయస్థానంను ఆశ్రయించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.
సీఏఏను నిరసిస్తూ దేశంలో అనేక రాష్ట్రాల్లో పెద్దఎత్తున హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పౌరసత్వ సవరణ చట్టం 2019ని అమలు చేయబోమని కేరళతోపాటు పశ్చిమ బెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్, చత్తీశ్గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించాయి. అసోంలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఈ చట్టాన్ని రూపొందించారని, ఇది రాజ్యాంగంలో పేర్కొన్న లౌకికవాదం, సమానత్వ స్ఫూర్తికి విరుద్ధమని ప్రతిపక్షాలు, చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి.
కాగా, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ లలో మత పరమైన పీడనకు గురైన అక్కడి మైనార్టీలకు భారత్ లో పౌరసత్వం కల్పించే ఉద్దేశంతో రూపొందించిన చట్టానికి గతేడాది డిసెంబర్ లో పార్లమెంటు ఆమోదం తెలిసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సి), జాతీయ జనాభా జాబితా (ఎన్పిఆర్)లను నిరసిస్తూ… దేశ వ్యాప్తంగా ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.