కనిమొళి ఇంట్లో ఆదాయపన్ను సోదాలు
తప్పుడు సమాచారమన్న అధికారులు
చెన్నై: తమిళనాడులో గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ అధికారులు వరుసపెట్టి దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఢీఎంకే ఎంపీ కనిమొళి ఇంట్లో కూడా రెండు గంటల పాటు సోదాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోదరి అయిన కనిమొళి.. తూత్తుకూడిలో పోటీచేస్తున్నారు. తూత్తుకూడిలోని ఆమె ఇంటి మొదటి అంతస్తులో భారీ మొత్తంలో నగదు ఉందని సమాచారం రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కానీ అక్కడేమీ లభించకపోవడంతో ఖాళీ చేతులతో వెనుదిరిగారు.
కేవలం తనను భయపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని కనిమొళి మండిపడ్డారు. ఎన్నికల కమిషన్, ఆదాయపన్ను శాఖ కూడా మోదీ కూటమిలో భాగం అయిపోయాయని, ప్రతిపక్ష పార్టీలను భయకంపితులను చేయాలని వాళ్లు చూస్తున్నారని ఆమె అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, తూత్తుకూడిలో ప్రత్యర్థి తమిళి సై సౌందర్ రాజన్ ఇంట్లో కోట్లాది రూపాయలున్నా.. అక్కడ దాడులు ఎందుకు చేయరని పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రశ్నించారు. ఓడిపోతామన్న భయంతోనే ఐటీ, సీబీఐ, కోర్టులు, చివరకు ఎన్నికల కమిషన్ ను కూడా ఎన్నికలలో మోదీ వాడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తమిళనాడులో వెల్లూరు మినహా 38 లోక్ సభ స్థానాలు, 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటివరకు ఐటీశాఖ చేసిన దాడుల్లో రూ. 500 కోట్ల నగలు, నగదు పట్టుకున్నారు.