కూలీ సనావుల్లాపై పోలీసుల దర్యాప్తు
మాజీ సైనికుడు సనావుల్లా అరెస్టు
భారతదేశ పౌరుడే కాదంటూ ఆరోపణలు
గువాహటి: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది ఈ వ్యవహారం. ఒక మాజీ సైనికుడిని అసలు భారతీయుడే కాదు పొమ్మంటూ చెప్పి.. ఆయనను తీవ్రంగా అనుమానించి, అవమానించి.. చివరకు అది రికార్డుల్లో తప్పంటూ నాలుక కరుచుకుంటున్నారు. అసోంలో సనావుల్లా అనే పేరే ఉన్న వేరే వ్యక్తిమీద తాను విచారణ జరిపాను తప్ప మాజీ సైనికుడి మీద కాదని, అదంతా రికార్డులలో గందరగోళమని ఈ కేసు విచారించిన అసోం బోర్డర్ పోలీసు అధికారి చంద్రమల్ దాస్ చెబుతున్నారు. మహ్మద్ సనావుల్లా 2017 వరకు ఆర్మీలో సుబేదారుగా పనిచేసి కశ్మీర్, మణిపుర్ రాష్ట్రాల్లో ఉగ్రవాదులతో పోరాడారు. తర్వాత అసోం బోర్డర్ పోలీసు విభాగంలో ఎస్ఐగా కూడా చేశారు. అయితే, కూలిపని చేసుకునే సనావుల్లా అనే వ్యక్తిమీద ఇచ్చిన నివేదిక ఆధారంగా మాజీ సైనికుడు సనావుల్లాను అరెస్టుచేశారు.
బోర్డర్ పోలీసులు అసలు విచారణే జరపలేదని, తర్వాత రికార్డులు తారుమారు చేశారని.. అందువల్ల తమకు న్యాయం చేయాలని సనావుల్లా కుటుంబం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. తానసలు మాజీసైనికుడు సనావుల్లాపై విచారణే జరపలేదని రిటైర్డ్ అసోం బోర్డర్ పోలీసు అధికారి చెప్పారు. ఆయన వేరే సనావుల్లా అన్నారు. అయితే.. అదంతా పదేళ్ల క్రితం జరిగిన ఘటన కావడంతో తనకు గుర్తులేదని, పాలనాపరమైన లోపాల కారణంగా ఒక వ్యక్తికి సంబంధించిన నివేదిక వేరే వ్యక్తి ఫైల్లోకి వెళ్లి ఉండచ్చని అన్నారు.
అయితే దీనిపై అసోం పోలీసులు ఇంకా స్పందించలేదు. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటున్నామని, సనావుల్లాను బోర్డర్ పోలీసు విధుల నుంచి తప్పించామని సీనియర్ పోలీసు అధికారి భాస్కర్ జ్యోతి మహంత ఇంతకుముందు అన్నారు. 2009లోనే ఫారినర్స్ ట్రిబ్యునల్ లో కేసు నమోదైనా, ఎనిమిదేళ్ల తర్వాత 2017 డిసెంబరులో సనావుల్లాకు దాని గురించి తెలిసింది. తన పేరు జాతీయ పౌరచిట్టా తొలి ముసాయిదాలో లేకపోవడంతో ఇదంతా మొదలైంది. అసలు తనిఖీ జరిగిందని చెబుతున్న సమయానికి తాను అసోంలోనే లేనని, ఆ సమయంలో మణిపుర్ లో చొరబాట్ల నిరోధక చర్యల్లో ఉన్నానని చెప్పారు. ఆయన సర్వీసు రికార్డు కూడా దానికి అనుగుణంగానే ఉంది.